పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సత్తాచాటాడు. పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్స్కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్లో చైనీస్ తైపీ ఆటగాడు చౌ తియెన్ చెన్ను 19-21, 21-15, 21-12తో ఓడించాడు. ఈ క్రమంలో సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. విశ్వక్రీడల్లో సెమీఫైనల్స్కు అర్హత సాధించిన తొలి భారత మెన్స్ షట్లర్గా రికార్డు సాధించాడు.

తొలి గేమ్ను 19-21తో కోల్పోయిన లక్ష్యసేన్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. క్రాస్ కోర్టు షాట్లతో సత్తాచాటాడు. రెండో గేమ్ను 21-15తో సత్తాచాటాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రత్యర్థికి లక్ష్యసేన్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చైనీస్ తైపీ ఆటగాడిని చిత్తుగా ఓడించి ఘనంగా ముగించాడు.
ఈ పారిస్ ఒలింపిక్స్లో స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ప్రిక్వార్టర్స్లో సింధు, క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించారు. దీంతో బ్యాడ్మింటన్లో ఆశలన్నీ లక్ష్యసేన్పైనే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లక్ష్యసేన్ సెమీస్కు చేరాడు. కాగా, ప్రిక్వార్టర్స్లోభారత్కే చెందిన హెచ్.ఎస్.ప్రణయ్ను 21-12, 21-6తో లక్ష్య చిత్తు చేసి క్వార్టర్స్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.