టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు పారిస్ విశ్వక్రీడల్లోనూ పతక దిశగా దూసుకెళ్తోంది. గ్రూప్-బీలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇండియా 3-2తో విజయం సాధించింది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ మరోసారి నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటి రెండు గోల్స్ సాధించాడు. అభిషేక్ శర్మ ఓ గోల్ వేశాడు.
కాగా, ఒలింపిక్స్లో 52 ఏళ్ల తర్వాత భారత్ ఆస్ట్రేలియాపై తొలిసారి విజయం సాధించింది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ తర్వాత ఆసీస్ను భారత్ ఓడించడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియాపై గెలుపు కోసం అయిదు దశాబ్దాల నిరీక్షణకు ఇవాళ తెరపడింది. ఇప్పటికే ఇరు జట్లు క్వార్టర్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

అయితే మ్యాచ్ను భారత్ 4-2తో ముగించేది. నాలుగో గోల్ చేసిన టీమిండియా సంబరాలు చేసుకుంది. కానీ ఆస్ట్రేలియా రివ్యూని కోరింది. స్టిక్ చెక్తో థర్డ్ అంపైర్ ఆ గోల్ను రద్దుచేశాడు. దీంతో 3-2తో మ్యాచ్ ముగించింది. మ్యాచ్ ఆరంభమైన 12వ నిమిషంలో అభిషేక్ గోల్ సాధించాడు. కాసేపటికే కెప్టెన్ హర్మన్ప్రీత్ గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. పెనాల్టీ కార్నర్ను అద్భుతంగా గోల్గా మలిచాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా ఖాతా ప్రారంభించినా మూడో క్వార్టర్లో హర్మన్ప్రీత్ భారత్కు మూడో గోల్ అందించాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎటాకింగ్ షాట్లను శ్రీజేష్ గొప్పగా డిఫెండ్ చేశాడు.