పారిస్ ఒలింపిక్స్-2024లో తొలి స్వర్ణం చైనాకు దక్కింది. గత టోక్యో ఒలింపిక్స్లో ఒక్క పసిడి పతకంతో అగ్రస్థానాన్ని కోల్పోయిన చైనా ఈసారి బంగారు బోణీ కొట్టింది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఈ పోటీలో దక్షిణ కొరియా రజతం, కజకిస్థాన్ కాంస్య పతకాలను గెలిచింది.
మన భారత షూటర్లు అర్జున్ బబుతా- రమిత జోడీ ఒక్క పాయింట్తో కాంస్య పతక పోరుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన షూటింగ్ క్వాలిఫికేషన్ రౌండ్లో 628.7 పాయింట్లతో అర్జున్ బబుతా-రమిత ఆరో స్థానంలో, వలరివన్-సందీప్ సింగ్ 623.6 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. అయితే నాలుగో స్థానంలో నిలిచిన జర్మనీ ద్వయానికి మనోళ్లకు మధ్య అంతరం ఒక్క పాయింటు మాత్రమే. మరో పాయింటు సాధించి ఉంటే భారత్ కాంస్య పతక పోరులో నిలిచేది.

చైనా (632.2), కొరియా (631.4), కజకిస్థాన్ (630.8), జర్మనీ (629.7) టాప్-4లో నిలిచాయి. స్వర్ణం కోసం చైనా, దక్షిణ కొరియా పోటీపడ్డాయి. చైనా జంట హువాంగ్ యుటింగ్-షెంగ్ లిహావో కొరియా ద్వయం కిమ్ జిహ్యోన్-పార్క్ హజున్పై 16-12తో పైచేయి సాధించి గోల్డ్ సాధించింది. గత టోక్యో ఒలింపిక్స్లో అమెరికా కేవలం ఒక్క పతకం తేడాతో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా 39 స్వర్ణాలు సాధించగా, చైనా 38 పసిడి పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
కాగా, తొలి రోజున పతకాల పోటీలు షూటింగ్తో పాటు ఇతర క్రీడలు కూడా ఉన్నాయి. డైవింగ్, సైక్లింగ్, జుడో, స్కేట్బోర్డింగ్, రగ్బీ సెవెన్స్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ పోటీల్లో ఇవాళ విజేతలు తేలనున్నారు. ఆగష్టు 11 వరకు పారిస్ విశ్వక్రీడలు జరగనున్నాయి.