ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో తాము ప్రేమించిన వ్యక్తికి లవ్/మ్యారేజ్ ప్రపోజల్ చేయడం చాలా మందికి ఫ్యాంటసీ. ఇదే కోరిక కలిగిన చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ ల్యూ యుచెన్ తన ప్రేయసికి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. అయితే పెళ్లి ప్రతిపాదన అనేది సాధారణ విషయమే. కానీ అతను ప్రస్తుతం ఒలింపిక్స్లో అభిమానుల ముందు ప్రపోజ్ చేశాడు.
అసలేం జరిగిందంటే.. మిక్స్డ్ డబుల్స్లో చైనా స్వర్ణం గెలిచింది. జెంగ్-హువాంగ్ యా కియాంగ్ పసిడి గెలిచారు. కొరియా ద్వయం కిమ్ వోన్-నాయన్పై 21-8, 21-11తో ఘన విజయం సాధించారు. అయితే గోల్డ్ మెడల్ సాధించి ఆనందంలో ఉన్న హువాంగ్కు ఓ సర్ప్రైజ్ ఎదురైంది. ఆమె సహచరుడు, చైనా డబుల్స్ ప్లేయర్ లీ యుచెన్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది.

లీ యుచెన్ రింగ్ను తీసుకువచ్చి అభిమానుల మధ్య హువాంగ్ను ప్రపోచ్ చేశాడు. మోకాళ్లపై కూర్చొని 'నన్ను పెళ్లాడతావా' అని అడిగాడు. వెంటనే సంతోషంతో హువాంగ్ పెళ్లి ప్రతిపాదన ఓకే చెప్పింది. ఒలింపిక్ గోల్డ్ మెడల్తో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ ఒకేసారి హువాంగ్ పొందడం విశేషం.
కాగా, పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో చైనా మొత్తంగా 30 పతకాలు సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య జట్టు ఫ్రాన్స్ 33 పతకాలు సాధించింది. అయితే ఫ్రాన్స్ 10 పసిడి, 11 సిల్వర్, 12 కంచు పతకాలు గెలిచింది. ఇక ఆస్ట్రేలియా (21 పతకాలు, 10 స్వర్ణాలు), అమెరికా (42 పతకాలు, 9 స్వర్ణాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు కాంస్యాలతో భారత్ 44వ స్థానంలో ఉంది.