పారిస్ ఒలింపిక్స్- 2024లో పతక లక్ష్యంగా భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. టాప్ సీడ్ చైనా బాక్సర్ వు యుతో గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్లో నిఖత్ 0-5తో ఓటమిపాలైంది. ఇక బాక్సింగ్లో పతక ఆశలు లవ్లీనా, నిశాంత్పైనే ఉన్నాయి.
ఆది నుంచి ప్రత్యర్థి వుయు విరుచుపడటంతో తెలంగాణ బిడ్డ ప్రతిఘటించలేకపోయింది. తొలి రౌండ్ ముగిసేసరికి 1-4తో నిలిచింది. రెండో రౌండ్లో కాస్త దూకుడు పెంచి న్యాయమూర్తుల తీర్పును 2-3గా మార్చుకుంది. అయితే మూడో రౌండ్లో మరింత దూకుడగా ప్రత్యర్థిపై చెలరేగింది. ఈ క్రమంలో రెఫరీ నుంచి హెచ్చరిక కూడా ఎదుర్కొంది. కాగా, అంతిమంగా చైనా బాక్సర్ వుయు విజేతగా నిలిచింది.

తొలి బౌట్లో జర్మనీ బాక్సర్ను చిత్తు చేసిన నిఖత్.. ముందు నుంచి భయపడినట్లుగానే ప్రిక్వార్టర్స్లో చైనా ప్లేయర్ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్లో గెలిస్తే తమ కూతురు తప్పక పతకం సాధిస్తుందని ఇటీవల నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్.. 'వన్ ఇండియా', 'మైకేల్'తో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ విశ్వక్రీడల్లో బాక్సింగ్లో లోవ్లీనా, నిశాంత్ పోరాటమే మిగిలి ఉంది. క్వార్టర్స్ ఫైనల్స్కు చేరిన వీరిద్దరి మ్యాచ్లు ఆగష్టు 4న ఉన్నాయి.
అయితే ఇవాళ భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె కాంస్యం సాధించాడు. ఈ క్రమంలో స్వప్నల్ చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. మరోవైపు బెల్జియంతో జరిగిన మ్యాచ్లో మన హాకీ జట్టు 1-2తో ఓటమిపాలైంది. ఈ ఒలింపిక్స్లో మన హాకీ జట్టుకు ఇదే తొలి ఓటమి.