పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్ మను బాకర్ మరో పతకానికి చేరువలో నిలిచింది.10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతక పోరుకు సరబ్జోత్ సింగ్తో కలిసి అర్హత సాధించింది. మంగళవారం జరగనున్న ఈ కీలక పోరులో దక్షిణ కొరియాతో పోటీపడాల్సి ఉంది. అయితే మరో పాయింట్ సాధించి ఉంటే మన షూటర్లకు కనీసం రజతం ఖాయమయ్యేది.
సోమవారం జరిగిన క్వాలిఫికేషన్లో మను బాకర్-సరబ్జోత్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. వీరిద్దరు కలిసి 580 పాయింట్లు సాధించారు. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన దేశాలు సాధించిన పాయింట్లు 582, 581 మాత్రమే. అగ్రస్థానంలో నిలిచిన టర్కీ షూటర్లు తర్హాన్-డికేక్ 582 పాయింట్లు, సెర్బియా షూటర్లు అరునోవిక్-మైకేక్ 581 పాయింట్లు సాధించారు. మన షూటర్లు మరో పాయింటు సాధిస్తే ఇవాళే పతకం సాధించేవాళ్లం.

మను బాకర్ తొలి రెండు సిరీస్ల్లో 98 పాయింట్లతో సంచలన ప్రదర్శన చేసింది. కానీ మూడో సిరీస్లో 95 పాయింట్లకు పరిమితమైంది. మరోవైపు సరబ్జోత్ సింగ్ తొలి సిరీస్లో 95, మిగిలిన సిరీసుల్లో వరుసగా 97 పాయింట్లు కొట్టాడు. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలోనే బరిలోకి దిగిన మరో భారత జోడీ రిథమ్-అర్జున్ చీమా పదో స్థానంలో నిలిచింది. కాగా, రేపు మధ్యాహ్నం 1 గంటకు దక్షిణా కొరియాతో జరిగే పోరు ప్రారంభం కానుంది.
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్గా ఆమె చరిత్రకెక్కెంది. రేపు జరిగే పోరులోనూ ఆమె పతకం సాధిస్తే ఓ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిగా ఘన చరిత్ర సృష్టిస్తుంది. భారత్ తరఫున ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారులు ఇద్దరే. రెజ్లర్ సుశీల్, షట్లర్ సింధు రెండు మెడల్స్ సాధించినా ఒకే ఒలింపిక్స్లో అందుకోలేదు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో రమిత జిందాల్ నిరాశపర్చింది. ఫైనల్ పోరులో ఆమె ఏడో స్థానానికి పరిమితమైంది.