పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్ మను బాకర్ మరో మెడల్ను సాధించింది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకం గెలిచింది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో దక్షిణ కొరియా ద్వయం జుయీ లీ- వోన్షోలీపై మన షూటర్లు 16-10తో విజయం సాధించారు.
ఈ క్రమంలో ఓ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్గా మను బాకర్ ఘన చరిత్ర సృష్టించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ మను బాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఒలింపిక్స్లో మొత్తంగా రెండు పతకాలు సాధించిన మూడో భారత అథ్లెట్గా రికార్డులకెక్కింది. రెజ్లర్ సుశీల్, షట్లర్ సింధు రెండు మెడల్స్ సాధించారు.

అయితే భారత్ తరఫున స్వాతంత్రానికి ముందు నార్మన్ ప్రిచార్ట్ ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించాడు. 1900 విశ్వక్రీడల్లో 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్లో నార్మన్ రజతాలు సాధించాడు. కాగా, స్వతంత్ర భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్ మను బాకర్.మరోవైపు సరబ్జోత్ సింగ్కు ఇదే తొలి ఒలింపిక్స్ మెడల్.
కాగా, విజయానంతరం మను బాకర్, సరబ్జోత్ మాట్లాడారు. ''రెండో పతకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాంస్య పతక పోరుకు ముందుగానే నేనే, సరబ్జోత్ వ్యూహాన్ని చర్చించుకున్నాం. అనుకన్నట్లుగా ప్రణాళిక ఫలించింది'' అని మను బాకర్ పేర్కొంది.
''ఒలింపిక్స్ పతకాన్ని మొదటి సారి గెలిచాను. ఎంతో సంతోషంగా ఉంది. తీవ్ర కఠినమైన పోటీ ఎదుర్కొన్నాం. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవాళ కనబరిచారు'' అని సరబ్జోత్ సింగ్ అన్నాడు. 13 సిరీస్లు పాటు సాగిన ఈ పోరు ఉత్కంఠగా సాగింది. తొలుత దక్షిణ కొరియా పైచేయి సాధించింది. ఆ తర్వాత భారత షూటర్లు పుంజుకుని సత్తాచాటారు.