పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్, రెండు కాంస్య పతకాల విజేత మను బాకర్ మూడో మెడల్కు అతిచేరువలో నిలిచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో మరోసారి తూటాలతో విజృంభించింది. 590 పాయింట్లతో టాప్ 2లో నిలిచి ఫైనల్స్కు క్వాలిఫై అయ్యింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు పతక పోరు ప్రారంభం కానుంది.
శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్లో మను బాకర్తో పాటు బరిలోకి దిగిన మరో భారత షూటర్ ఇషా సింగ్ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది. కాగా, ఆదిలో నిలకడగా పాయింట్లు సాధించిన మను బాకర్ క్రమంగా పుంజుకుంది. ప్రిసిషన్ రౌండ్లో 294 పాయింట్లు సాధించి టాప్ 3లో నిలిచింది. ఆ తర్వాత ర్యాపిడ్ రౌండ్లో దూకుడు పెంచి తొలి సిరీస్లో ఏకంగా 100 పాయింట్లు కొల్లగొట్టింది. ఈ రౌండ్లో 296 స్కోరు సాధించింది.

మను బాకర్ మరో రెండు పాయింట్లు సాధిస్తే తొలి స్థానంలో నిలిచిన హంగరీ షూటర్ వెరోనికా స్కోరు సమం చేసేది. కాగా, 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకంతోనే ఆమె భారత్ ఖాతాను తెరిచింది. ఓ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్గా మను బాకర్ ఘన చరిత్ర సృష్టించింది.