హైదరాబాద్: పారాలింపిక్ స్విమ్మర్ వినోద్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే బీహార్లోని భగల్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపాన ఓ తోటలో వినోద్ మృతదేహాన్ని పాడైపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు.
వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఉరివేసి చంపి అతడి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ప్రకారం వినోద్ సింగ్ను ఐదు రోజుల క్రితమే హత్య చేసి ఉంటారని ఆయన వెల్లడించారు.
వినోద్ సింగ్ జనవరి 6వ తేదీన తమ కుమారుడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వినోద్కు సహ క్రీడాకారిణితో ప్రేమ వ్యవహారం ఉందని, ఇది ఏమాత్రం ఇష్టం లేదని ఆమె కుటుంబ సభ్యులే తమ కుమారుడిని అపహరించి, ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని మృతుని తండ్రి ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే వినోద్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భగల్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.