హైదరాబాద్: పారాలింపియన్ దీపామాలిక్ సోమవారం బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా దీపామాలిక్కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సందర్భంగా దీపామాలిక్ మాట్లాడుతూ ప్రధాని మోడీ తన ఆలోచనలతో మహిళల సాధికారతకు కృషి చేశారని అన్నారు. మహిళలకు కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించారని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొన్నారు.
కాగా, పారాలింపిక్ గేమ్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా దీపామాలిక్ చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే, ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు అరుణ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ల సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
గంభీర్ మాట్లాడుతూ దేశానికి సేవ చేసేందుకు ఇదో చక్కని వేదిక అని అన్నారు. ప్రధాని మోడీ విజన్ నచ్చే బీజేపీలోకి చేరానని.. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని గంభీర్ తెలిపారు. గంభీర్కు ఢిల్లీ ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి.
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో గంభీర్ నివసిస్తున్నారు. రాజేంద్ర నగర్ న్యూఢిల్లీ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. దీంతో అదే సీటుని గంభీర్కు కేటాయించవచ్చని తెలుస్తోంది. 2014లో మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ సారి ఆమెకు బదులుగా గంభీర్ కు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.