
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పోటీల్లో ఏడో రోజైన శుక్రవారం మరో ఐదు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల చెస్లో రెండు, అథ్లెటిక్స్లో రెండు, బ్యాడ్మింటన్లో ఓ స్వర్ణం లభించాయి.
మహిళల ర్యాపిడ్ చెస్ పి1 విభాగంలో జెన్నిత 1-0తో మనురుంగ్ రోస్లిండా(ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణం చేజిక్కించుకోగా... పురుషుల ర్యాపిడ్-6 బీ2/బీ3 విభాగంలో కిషన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పరుల్ పర్మార్ 21-9, 21-5తో వన్డీ కమ్టమ్ (థాయ్లాండ్)పై నెగ్గి భారత్కు మూడో స్వర్ణం అందించింది.
ఇక, పురుషుల జావెలిన్ త్రో ఎఫ్55 విభాగంలో నీరజ్ యాదవ్ (29.24 మీటర్లు) స్వర్ణం నెగ్గగా... అమిత్ బల్యాన్ ((28.79 మీటర్లు) రజతం సొంతం చేసుకున్నాడు. మెన్స్ క్లబ్ త్రో ఎఫ్51 విభాగంలో అమిత్ కుమార్ (29.47 మీటర్లు) పసిడి పతకం గెలుచుకోగా... ధరమ్వీర్ (24.81 మీటర్లు) రజతం సాధించాడు.

పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ర్టోక్ స్విమ్మింగ్ ఎస్10 కేటగిరీలో స్వప్నిల్ పాటిల్ రజతం నెగ్గాడు. పురుషుల 4000 మీటర్ల సైక్లింగ్ సీ4 విభాగంలో గుర్లాల్ సింగ్ కాంస్యం సాధించాడు. టోర్నీలో ఇప్పటికే జావెలిన్ త్రోలో కాంస్యం సాధించిన పారాలింపిక్స్ పతక విజేత దీపా మాలిక్ డిస్కస్ త్రోలోనూ సత్తాచాటుతూ రెండో పతకం సాధించింది.
దీపా మాలిక్ గుండును 9.67 మీటర్లు విసిరి కాంస్య పతకం సాధించింది. ఇక, మహిళల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో నిధి మిశ్రా (21.82 మీటర్లు) కాంస్యం సాధించింది. సైక్లింగ్లో గురులాల్ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నాటికి భారత్ ఖాతాలో మొత్తం 63 పతకాలు చేరాయి. ఇందులో 13 స్వర్ణ, 20 రజత పతకాలు ఉన్నాయి.