అడిలైడ్: ప్రపంచ బిలియర్డ్స్లో తనకు తిరుగులేదని భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ మరోసారి రుజువు చేశాడు. ఇక్కడ జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సింగపూర్ ఆటగాడు పీటర్ గిల్క్రిస్ట్ను 1,168 పాయింట్ల తేడాతో చిత్తుచేశాడు.
అద్భుతమైన ఆటతో ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 5 గంటల పాటు సాగిన ఫైనల్లో పంకజ్ 2408-1240 తేడాతో పీటర్ గిల్క్రిస్ట్ను ఓడించాడు. పంకజ్ కెరీర్లో ఇది 14వ ప్రపంచ టైటిల్ (10 బిలియర్డ్స్, 4 స్నూకర్) కావడం విశేషం.
వరుసగా 127, 360, 301, 284, 119, 101, 106 పాయింట్లతో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన పంకజ్ సగం మ్యాచ్ ముగిసే సమయానికే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. ద్వితీయార్ధంలో గిల్క్రిస్ట్ పోరాడినా... పంకజ్ అదే జోరు ప్రదర్శించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
'వారం క్రితం ఫార్మాట్ ఫైనల్ టోర్నీలో పీటర్ గిల్క్రిస్ట్ చేతిలో పరాజయం చవిచూసినా.. ఈ ఫైనల్లో ఓడకూడదనే సంకల్పంతో బరిలో దిగా. నా సోదరుడు, మానసిక వైద్య నిపుణుడు శ్రీ సహకారం నా విజయానికి తోడ్పడింది' అని పంకజ్ అద్వానీ తెలిపాడు.
'చాలా రోజులుగా బిలియర్డ్స్, స్నూకర్స్లో వరుసగా టోర్నీలు ఆడుతున్నా. ఈ ఏడాది 6-రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ మొదలుకొని ఇప్పుడు ప్రపంచ బిలియర్డ్స్ వరకు అన్ని విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి' అని పంకజ్ చెప్పాడు.