భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వానీ ఖాతాలో మరో వరల్డ్ టైటిల్ చేరింది. దోహా వేదికగా జరిగిన ఐబీఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఇంగ్లండ్ ప్లేయర్ రాబర్ట్ హాల్ను చిత్తుగా ఓడించాడు. 4-2తో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. తొలి మూడు ఫ్రేమ్లో 150+ స్కోరుతో రాబర్ట్ను ఓడించాడు.
అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ ప్లేయర్ పుంజుకుని రెండు ఫ్రేమ్లు నెగ్గాడు. కానీ ఆరో ఫ్రేమ్లో పంకజ్ తిరిగి సత్తాచాటాడు. 152-46తో విజయం సాధించాడు. కాగా, బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల పంకజ్కు ఓవరాల్గా రికార్డు స్థాయిలో ఇది 28వ ప్రపంచ టైటిల్. వరుసగా ఏడో టైటిల్ సాధించాడు. బిలియర్డ్స్లో 19 సార్లు ఛాంపియన్గా నిలిచిన పంకజ్ ప్రపంచ స్నూకర్లో తొమ్మిది సార్లు టైటిల్ అందుకున్నాడు.

2016 నుంచి పంకజ్ వరుసగా టైటిళ్లు గెలవడం విశేషం. మధ్యలో కరోనా కారణంగా 2020, 2021లో టోర్నీలు జరగలేదు. కాగా, వరుస టైటిళ్లు గెలవడంపై పంకజ్ అడ్వాణీ స్పందించాడు. ప్రపంచ బిలియర్డ్స్ టైటిళ్లు వరుసగా గెలవడం అద్భుతంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ విజయాలు అంత సులువుగా దక్కట్లేదని, తీవ్రమైన పోటీలో సత్తాచాటుతున్నాని తెలిపాడు.
ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు స్పోర్ట్స్ సైకాలజిస్ట్, తన సోదరుడు అండగా నిలుస్తున్నారని చెప్పాడు. గతాన్ని మరిచి వర్తమానంపై దృష్టిసారించి ఆటలో సత్తాచాటేలా వాళ్లు సాయం చేస్తారని తెలిపాడు. అయితే ఈ విజయాలు దేశం కోసమని పంకజ్ అడ్వానీ పేర్కొన్నాడు. కాగా, ఈ మెగా టోర్నీలో పీటర్ గిల్క్రిస్ట్ (సింగపూర్), సౌరవ్ కొఠారి (భారత్) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచి కాంస్యాలు అందుకున్నారు.