అడిలైడ్: ఇప్పటి వరకు జరిగిన అన్ని క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ సారథి మిస్బా ఉల్ హక్ స్పందించాడు. ఈ చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తామని హక్ చెప్పాడు.
క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా వచ్చే ఆదివారం నాడు అడిలైడ్లో భారత్ - పాకిస్తాన్ దేశాల జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్లో భారత్ పైన గెలిచేందుకు పాకిస్తాన్ క్రికెటర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు పాక్ క్రికెటర్లు స్పందించారు.
ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచులలో తమ దేశం జట్టు ఎందుకు ఓడిపోయిందో తనకు అర్థం కావడం లేదన్నారు. బహుశా.. ముఖ్యమైన ఇలాంటి మ్యాచులలో ఒత్తిడిని తట్టుకోలేకపోయి ఉంటారని అభిప్రాయపడ్డాడు.
షాహిద్ అఫ్రీది మాట్లాడుతూ.. ఈసారి తాము చరిత్రను తిరగరాస్తామనే నమ్మకం ఉందన్నాడు. భారత్తో జరిగే మ్యాచ్ను ఉద్దేశిస్తూ.. ఈసారి జరిగే ముఖ్యమైన గేమ్లో తాము గెలుస్తామని చెప్పాడు. తమ మేనేజ్మెంట్, ఆటగాళ్లు గెలుపు కోసం ఆరాటపడుతున్నారన్నాడు. 2011 ప్రపంచకప్లో భారత్ చేతిలో ఓడిన సమయంలో అఫ్రీది సారధిగా ఉన్నాడు.

తాము తొలి మ్యాచ్ భారత్తో అడుతున్నామని, ఈ తొలి మ్యాచ్లో తాము గెలిస్తే.. ప్రపంచకప్ ఆరంభం తమకు మంచి కిక్ అని యూనిస్ ఖాన్ అన్నాడు. తన నుండి అభిమానులు ఏం ఆశిస్తున్నారో తనకు తెలుసునని ఇర్ఫాన్ అన్నాడు. ఇంతకుముందు పలుమార్లు తాను భారత్ పైన బాగా ఆడానని, ఇప్పుడు కూడా అలాగే ఆడుతానని చెప్పాడు.
భారత్తో ఆడే మ్యాచ్ను ఉద్దేశించి... ఈ మ్యాచ్ తమకు ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసునని మక్సూద్ అన్నాడు. భారత్తో ఆడే మ్యాచులో తాము గెలిస్తే ఎంతో ఆనందమని, అందులోను తాను సెంచరీ చేస్తే ఇంకా కూల్ అని కొత్తగా వచ్చిన సోహైల్ ఖాన్ అన్నాడు.
బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నప్పటికీ అతనిని పెవిలియన్కు పంపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, అది కోహ్లీ అయినా మరెవరయినా అని సోహైల్ ఖాన్ అన్నాడు. వాహప్ రియాజ్ మాట్లాడుతూ.. మొహాలీలో భారత్ పైన జరిగిన గత ప్రపంచకప్ తనకు మంచి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పాడు.