న్యూఢిల్లీ: భారత ఓపెన్ వాటర్ స్విమ్మర్ భక్తి శర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. అట్లాంటిక్ మహా సముంద్రంలో, కేవలం ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆమె 1.4 మైళ్ల దూరాన్ని 52 నిమిషాల్లో ఈదింది. గతంలో లూయిస్ పగ్ (బ్రిటన్), రినే కాక్స్ (అమెరికా) నెలకొల్పిన రికార్డును ఆమె అధిగమించింది.
అంతేగాక ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన పిన్నవయసు స్విమ్మర్గా, తొలి ఆసియా అమ్మాయిగా 24ఏళ్ల భక్తి రికార్డుకెక్కింది. కాగా, అరుదైన ఘనతను సాధించిన భక్తి శర్మకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు.
తాము స్పాన్సర్షిప్ అందిస్తున్న భక్తి ఒక అరుదైన రికార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హిందుస్థాన్ జింక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అఖిలేష్ జోషి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్మింగ్ పట్ల మరింత ఎక్కువ మంది మహిళల ఆసక్తిని ప్రదర్శించి, కెరీర్గా తీర్చిదిద్దుకోవడానికి భక్తి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.
కాగా, ఈ అరుదైన ఫీట్ను సాధించలేనేమోనన్న భయం తనను వెంటాడిందని, ఆ సమయంలో హిందుస్థాన్ జింక్ కంపెనీ తనకు అండగా నిలిచిందని భక్తి మరో ప్రకటనలో తెలిపింది. తనను ప్రోత్సహిస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.
ముంబైలో జన్మించినా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నివాసముంటున్న భక్తి శర్మ.. తల్లి లీమా శర్మ నుంచి స్విమ్మింగ్ను వారసత్వంగా పొంది గత పదేళ్ల కాలంలో ప్రపంచంలోని ఐదు మహా సముద్రాల్లోనూ ఈతకొట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇప్పటికే లెక్కకుమిక్కిలి ఘనతలను సొంతంచేసుకున్న భక్తి ప్రతిష్ఠాత్మక టెన్సింగ్ నార్కే జాతీయ సాహస అవార్డును సైతం అందుకుంది.