అడిలైడ్: పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ 7 అడుగులకు పైగా ఉంటాడు. అతడి బౌలింగ్ గురించి అందరు చాలా భయపడ్డారు! భారత బ్యాట్స్మన్ అయితే ప్రత్యేకంగా స్టూలు మీద మనిషిని నిలబెట్టి, వాళ్లతో బంతులు వేయించుకొని మరీ ఆ ఎత్తు కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు.
అయితే, ప్రపంచకప్లో భాగంగా భారత జట్టుతో జరుగుతున్న మొదటి మ్యాచ్లో ఇర్ఫాన్ అంత ప్రభావం చూపలేకపోయాడు. చివరకు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్కు ఉంచితే.. విరాట్ కోహ్లీ కొట్టిన ఫోర్ను ఆపలేకపోయాడు. అతను ఒక్క మేడిన్ ఓవర్ కూడా వేయలేదు.
ఎవరెలా అవుటయ్యారు?
రోహిత్ శర్మ (15) జట్టు పరుగులు 25 వద్ద ఉన్నప్పుడు అవుటయ్యాడు. సోహైల్ వేసిన బౌన్సర్ను అంచనా వేయడంలో విఫలమై అవుటయ్యాడు.

శిఖర్ ధావన్ (73) జట్టు పరుగులు 163 వద్ద ఉన్నప్పుడు అవుటయ్యాడు. 29.5 ఓవర్లో మిస్బావుల్ హక్ విసిరిన బంతికి అవుటయ్యాడు. హరీస్ సోహైల్ బౌలింగులో కోహ్లీ బంతిని కొట్టాడు. వెంటనే ధావన్ను పరుగుకు పిలిచాడు. అయితే, బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో వెనక్కి వచ్చేందుకు దావన్ ప్రయత్నించాడు. మిస్బా వెంటనే బంతిని వికెట్ల మీదకు విసరడంతో బౌలర్ సోహైల్ దానిని అందుకొని అవుట్ చేశాడు. మూడో అంపైర్ ధావన్ అవుటైనట్లు ప్రకటించాడు.
విరాట్ కోహ్లీ (107) సోహైల్ ఖాన్ బౌలింగులో ఉమర్ అక్మల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
సురేష్ రైనా (73) సోహైల్ ఖాన్ బౌలింగులో హారీస్ సోహైల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత 296 పరుగుల వద్ద జడెజా, ధోనీ, రహానేలు అవుటయ్యారు. దీంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది.
భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో 300 పరుగులు చేసింది. ఏటు వికెట్లు కోల్పోయింది. ఇందులో ధావన్ రనౌట్ అయ్యాడు. అయిదుగుర్ని సోహైల్ ఖాన్, ఒక్కరిని వాహెబ్ రియాజ్ అవుట్ చేశాడు.
కోహ్లీ రికార్డు సెంచరీలు...
పాకిస్తాన్ పైన విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు. 126 బంతుల్లో 7 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. అతను ధావన్తో కలిసి రెండో వికెట్కు, రైనాతో కలిసి మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లీకి కెరీర్లో ఇది 22వ సెంచరీ. ప్రపంచకప్లో ఇది రెండో సెంచరీ.
స్లో ఓవర్ బౌలింగుతో బోర్లా పడ్డ భారత్
ధావన్ - రోహిత్ శర్మలు మొదట వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశారు. రోహిత్ అవుటయ్యాక కోహ్లీ వచ్చాడు. కోహ్లీ వచ్చాక భారత్ దూకుడును పెంచింది. దీంతో చివరి ఓవర్ల వరకు దూకుడుగా ఆడారు. చివరి అయిదు ఓవర్లలో పాకిస్తాన్ స్లో బౌలింగుతో భారత్ను దెబ్బతీసింది. భారత్ 320 పరుగులకు పైగా చేస్తుందని భావించినప్పటికీ.. చివరలో స్లో బౌలింగ్ కారణంగా 296 పరుగుల వద్దనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
దీంతో భారత్ 300 పరుగులు మాత్రమే చేసింది. చివరి అయిదు ఓవర్లలో భారత్ 27 పరుగులు మాత్రమే చేసింది. 45 ఓవర్లకు 273 పరుగులు ఉండె. ఆ తర్వాత 320 వరకు వస్తుందని భావించినా.. స్లో బౌలింగుతో భారత్ దెబ్బతింది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఎప్పుడు కూడా 262 పరుగుల కంటే ఎక్కువ స్కోరును ప్రపంచకప్లో చేధించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ భారత్దే గెలుపు అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
రాణించిన ధావన్, కోహ్లీ, రైనా, రాణించలేకపోయిన ధోనీ
భారత ఆటగాళ్లలో ధావన్, కోహ్లీ, రైనా రాణించారు. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలు రాణించలేకపోయారు. ధోనీ, జడెజా, రహానేలు వెంటవెంటనే అవుట్ కావడంతో స్లాగ్ ఓవర్లలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.