Paris Plympics 2024:ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి.ఒక దేశాధ్యక్షుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తాడనే పేరుంది.ఎవరైతే నాకేంటి అనే స్థాయిలో ఆ దేశాధ్యక్షుడి వ్యవహార శైలి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికానే తన ఆలోచనలు, నిర్ణయాలతో వణికించిన నియంత. ఇప్పటికే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే. ఆ నియంతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. దక్షిణ కొరియా సరిహద్దు నుంచి ఉత్తరకొరియా సరిహద్దులోకి ఒక చీమ వచ్చిన అత్యంత పాశవికంగా వ్యవహరిస్తారు కిమ్ జాంగ్ ఉన్. అలాంటిది రెండు దేశాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపై నిల్చొని సెల్ఫీలు దిగారు.. ఇంతకీ వారెవరు ఆ స్టోరీ ఏంటి..?
ఉత్తరకొరియా- దక్షిణ కొరియా దేశాలకు చెందిన క్రీడాకారులు ఒకే వేదికపై సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. ఇందుకు వేదికగా నిలిచింది పారిస్ ఒలింపిక్స్. వాస్తవానికి ఇరు దేశాల మధ్య వైరం ఉన్నప్పటికీ అది క్రీడల్లో మాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన సన్నివేశం కనిపించింది. ఉత్తర దక్షిణ కొరియా ఆటగాళ్లు ఒకరినొకరు పలకరించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సౌత్ పారిస్ అరీనాలో జరిగిన టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో విజయం సాధించిన ఇరు జట్లు మెడల్స్ను అందుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా ఆటగాడు లిమ్ జాంగ్ హూన్ వెంటనే తన సెల్ఫోన్ తీసి గ్రూప్ సెల్ఫీ తీశాడు. ఇదే సమయంలో గోల్డ్ మెడల్ అందుకున్న చైనా ఆటగాళ్లు వాంగ్ చూకిన్ మరియు సన్ యింగ్షాలు కూడా జాయిన్ అయ్యారు.ఈ వీడియో వెంటనే ఒలింపిక్స్ కొరియన్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయడం జరిగింది. దీంతో ఇది ఒక సెన్సేషన్గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఉత్తరకొరియాకు చెందిన కిమ్ కుమ్-యాంగ్, రిజాంగ్ -సిక్ ద్వయం విజయాన్ని ఒక వేడుకగా జరుపుకున్నారు. 16వ సీడ్ వెండి పతకాన్ని సాధించారు. అంతకుముందు అగ్రశ్రేణి జట్లు అయిన జపాన్ హాంకాంగ్లను ఓడించి ఫైనల్స్కు చేరుకుంది ఉత్తర కొరియా. ఫైనల్స్లో చైనా పై పరాజయం చవిచూసింది.రియో 2016 ఒలింపిక్స్ తర్వాత తొలిసారిగా ఉత్తర కొరియా దేశం ఒలింపిక్స్లో పాల్గొంటోంది.ఇదిలా ఉంటే దక్షిణ కొరియా చివరిసారిగా టేబుల్ టెన్నిస్లో 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించింది.
ఇక పారిస్ ఒలింపిక్స్ 2024లో టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో పతకాలు సాధించిన ఉత్తరకొరియా, దక్షిణకొరియా, చైనా ఆటగాళ్లు పోడియం పై సెల్ఫీలు దిగడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. దేశాల మధ్య శతృత్వం ఉన్నప్పటికీ దేశాలను ఏకం చేయగల సత్తా ఒక్క క్రీడలకు మాత్రమే ఉందని ఇది మరోసారి నిరూపితమైందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి పారిస్ ఒలింపిక్స్ రెండు శతృదేశాలను ఏకం చేశాయి. అయితే ఇది వైరి నుంచి స్నేహం వైపు మరులుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.