
కామన్ వెల్త్ గేమ్స్లో భారత్కు మరో పతకం ఖాయమైపోయింది. ఇప్పటివరకు వచ్చిన 6 మెడళ్లు కేవలం వెయిట్ లిఫ్టింగ్లోనే వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాన్ బౌల్స్ క్రీడలో ఇండియాకు రజతం లేదా స్వర్ణం వచ్చేందుకు బాటలు పడ్డాయి. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్ను 16-13తో ఓడించింది. తద్వారా లాన్ బౌల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. లాన్ బౌల్స్ క్రీడలో తొలిసారి భారత్ పతకం సాధించబోతుండడం గమనార్హం. మహిళల ఫోర్స్ లాన్స్ బౌల్స్ జట్టులో లవ్లీ చౌబే ఆధిక్యం ప్రదర్శించగా, పింకీ రెండో స్థానంలో, నయన్మోని సైకియా తృతీయ స్థానంలో, రూపా రాణి టిర్కీ స్కిప్ పొజిషన్లతో ఆకట్టుకున్నారు.
వీరి ప్రదర్శనతో భారత ఖాతాలో కనీసం రజత పతకమైన చేకూరుతుంది. ఇక ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం లాన్ బాల్స్ కోచింగ్ స్టాఫ్ సంబరాలు చేసుకున్నారు. ఒకవేళ ఫైనల్లో గెలిస్తే భారత్కు స్వర్ణం కూడా దక్కొచ్చు. ఇక ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో నార్ఫోక్ ఐలాండ్ను ఓడించి లాన్ బౌల్స్ పోటీలో మహిళల ఫోర్స్ జట్టు సెమీఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు భారత్ ఆరు పతకాలు సాధించింది. ఇప్పుడు ఏడో పతకం కన్ఫామ్ అయింది.
ఇక ఇప్పటివరకు భారత్ తరఫున పతకాలు
1. మీరాబాయ్ చాను 49కేజీల విభాగంలో గోల్డ్,
2. జెరెమీ లాల్రినుంగా 67కేజీల విభాగంలో గోల్డ్,
3.అచింత షెవులి 73 కేజీల విభాగంలో గోల్డ్,
4. సంకేత్ మహదేవ్ 55 కేజీల విభాగంలో సిల్వర్,
5. బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో సిల్వర్,
6. గురురాజ్ పూజారి 61కేజీల విభాగంలో బ్రాంజ్
7. మహిళల ఫోర్స్ లాన్స్ బౌల్స్ టీం సిల్వర్ లేదా గోల్డ్ మెడల్