న్యూఢిల్లీ: భారత్కు రియో ఒలింపిక్స్లో పతక ఆశలు రేకెత్తించి, క్వార్టర్సులో అనుకోని విధంగా గాయం పాలై విలవిల్లాడుతూ ఇంటిదారి పట్టిన రెజ్లర్ వినేష్ ఉదంతంపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వినేష్ను ఉద్దేశించి.. నువు మా కూతురివి అని చెప్పారు.
దేశానికి పతకం అందించడంలో ఆశలను వదులుకోవాల్సి వచ్చినందుకు శారీరకంగా, మానసికంగా తాను చాలా కృంగిపోయినట్టు, తనను తాను మోసం చేసుకుంటూ బాగున్నట్టు తెలపడం సరైనదని కాదని వినేష్ ట్వీట్ చేశారు. తన కాలును చైనా క్రీడాకారిణి విరిచివేయడంపై.. తాను మానసికంగా, శారీరకంగా చాలా గాయపడ్డానని తెలిపింది.
రియో: ఓ వైపు 'సాక్షి' సంబరం, మరోవైపు వినేష్ విలవిల (పిక్చర్స్)
వినేష్ ట్వీట్ పైన సుష్మా స్పందించారు. ఆమెకు స్వాంతన కలిగించారు. వినేష్ను మా పుత్రికవని పేర్కొన్నారు. నీకు ఏ అవసరమున్నా తనను నిర్భయంగా అడగవచ్చునని ఆమె తెలిపారు. 'వినేష్.. నువ్వు మా బిడ్డవి. నీకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధం' అని సుష్మ పేర్కొంది.
సాక్షి మాలిక్ పైన...
ఒలింపిక్స్లో 58 కేజీల విభాగంలో కిర్గిజిస్థాన్కు చెందిన క్రీడాకారిణిని ఓడించి కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ను సుష్మా అభినందించారు. దేశం గర్వించేలా చేశావని ప్రశంసించారు.
సాక్షి మాలిక్ సోదరుడి ఆనందం
తనకు ఇంతకంటే మధురమైన రాఖీ పండగ లేదని రియోలో పతకం సాధించిన సాక్షి మాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇంతకంటే గొప్ప కానుకను ఏ చెల్లీ ఏ అన్నకూ ఇచ్చి ఉండదన్నారు. తన చెల్లెలు దేశ గౌరవాన్ని నిలబెట్టిందని, అంతకంటే తనకు ఇంకేం కావాలన్నారు.
ప్రతి ఆడపిల్ల కుటుంబాన్ని గర్వించేలా చేస్తుందని, తన చెల్లెలు మాత్రం కుటుంబంతో పాటు యావద్భారత దేశాన్ని గర్వించేలా చేసిందన్నారు. పతకం గెలవాల్సిన అవసరాన్ని తన చెల్లెలికి చెబుతూ పోటీకి ముందు ఓ మెసేజ్ పంపానని, విజయం సాధించిన తర్వాత అన్నగా ఆ విజయాన్ని ఎంతలా ఆస్వాదించిందీ, తన చెల్లెలంటే తనకు ఉన్న ఆప్యాయతను తెలియజేస్తూ ఒక మెసేజ్ పంపానని చెప్పారు.