
హైదరాబాద్: దక్షిణకొరియాలోని చాంగ్వాన్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఛాంపియన్షిప్లో భారత షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో అతడు స్వర్ణం సాధించాడు.
పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మొత్తం 564 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఛాంపియన్షిప్లో అతడికిదే తొలి పతకం కావడం విశేషం. ఇదే ఈవెంట్లో సెర్బియా షూటర్ డామిర్ మైకెక్ (562), దక్షిణ కొరియా షూటర్ డైమియంగ్ లీ (560) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
2014 ఐఎస్ఎస్ఎఫ్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించిన మరో భారత షూటర్ జీతూరాయ్ ఇదే ఈవెంట్లో 17వ స్థానంలో నిలిచాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఒలింపిక్స్లో లేకపోవడంతో ఈ పోటీల్లో ఓం ప్రకాశ్ మిథర్వాల్ స్వర్ణం సాధించినా... టోక్యో 2020 ఒలింపిక్ పోటీలకు అర్హత సాధించలేకపోయాడు.
జూనియర్ కాంపిటేషన్లో భారత్కు చెందిన సౌరభ్ చౌదరి, అభిండన్య పాటిల్లు పురుషుల మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించారు. 23 ఏళ్ల ఓం ప్రకాశ్ మిథర్వాల్ ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.