భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో ద్యుతీ చంద్ స్వర్ణ పతకం సాధించింది. ఇటలీలోని నపోలీ వేదికగా బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును ద్యుతీ చంద్ 11.32 సెకన్లలో ముగించి యూనివర్సిటీ పోటీల్లో పసిడి పతకం సాధించింది. దీంతో ఈ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్గా ద్యుతి రికార్డుల్లోకి ఎక్కింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
100 మీటర్ల రేసులో పాల్గొన్న డెల్ పొంటో (11.33సె), లిసా క్వాయి (11.39సె) రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఎనిమిది మంది పోటీపడ్డ ఈ రేసులో నాలుగో లైన్ నుంచి పరుగు మొదలుపెట్టిన ద్యుతి.. 11.32 సెకన్లలో గమ్యాన్ని చేరింది. ద్యుతీ చంద్ భువనేశ్వర్లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) విశ్వవిద్యాలయ విద్యార్థి. అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన ద్యుతీకి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.
🏅 Picked it up! pic.twitter.com/Qwci6Uz5Yr
— Dutee Chand (@DuteeChand) 9 July 2019
ఇటీవలి కాలంలో ద్యుతీ చంద్ ఆటతోనే కాదు తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. సమీప బంధువైన టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో ద్యుతీ చంద్పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ స్పష్టం చేసింది. ద్యుతీ సోదరి సరస్వతి కూడా అమ్మాయితో సంబంధానికి అంగీకరించలేదు. అయితే భయపెట్టడం, బ్లాక్మెయిల్ (రూ.25లక్షలు ఇవ్వాలని) చేయడం వంటివి సరస్వతి చేసిందని ద్యుతీ ఆరోపణలు చేసింది.
ఒడిషాకు చెందిన ద్యుతీ చంద్ జీవితం ఆధారంగా త్వరలో బాలీవుడ్లో ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్లో నటించే కథానాయిక మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. సినిమా హక్కుల కోసం చాలామంది నిర్మాతలు, నటీనటులు ద్యుతీని కలిసినా.. ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నా తన 'బయోపిక్' పాత్రకు పూర్తి న్యాయం చేయగలదు అని ద్యుతీ చంద్ అభిప్రాయపడ్డారు. మరి ఈ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.