హైదరాబాద్: 2024, 2028లలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వేదికలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సోమవారం ప్రకటించింది. 2024లో జరిగే ఒలింపిక్ వేడుకలకు ప్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యమిస్తుంది. ఇక 2028లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్కు లాస్ ఏంజెలెస్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు 'లాస్ ఏంజిల్స్ టైమ్స్' పేర్కొంది.
ఈ మేరకు సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఒలింపిక్ నిర్వహణ కమిటీతో ఈ మేరకు ఇప్పటికే డీల్ కుదిరినట్లు రాసుకొచ్చింది. 2024 ఒలింపిక్స్ కోసం ఐదు నగరాలు రేసులో ఉన్నప్పటికీ హాంబర్గ్, రోమ్, బుడాపెస్ట్లు తప్పుకున్నాయి. 2024 ఒలింపిక్స్ పారిస్లో జరగనుండగా ఆ తర్వాత 2028లో జరిగే వేడుకలకు లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనుందని వివరించింది.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి అతి త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది. అయితే లాస్ ఏంజిల్స్ నిర్వహణకు సంబంధించి లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్, యునైటెడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. మరోవైపు సెప్టెంబరులో పెరులోని లిమాలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సమావేశం తర్వాత కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గతంలో పారిస్లో రెండుసార్లు (1900, 1924)లో ఒలింపిక్స్ జరిగాయి. మళ్లీ వందేళ్ల తర్వాత 'సిటీ ఆఫ్ లవ్' మళ్లీ ఒలింపిక్స్ కోసం సిద్ధమైంది. ఇక లాస్ ఏంజిల్స్ (1932, 1984) కూడా ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్ను నిర్వహించింది. 2020లో జరిగే ఒలింపిక్స్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్నాయి.