
ముంబై: టోక్యో ఒలింపిక్స్ 2021లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన చిరకాల కల నెరవేర్చుకున్నాడు. శనివారం తన తల్లిదండ్రులను విమానం ఎక్కించి ఎంతో సంతోషపడ్డాడు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు. 'తొలిసారి మా అమ్మానాన్న ఫ్లైట్ ఎక్కారు. ఈరోజుతో నా చిన్న కల నెరవేరింది' అంటూ కాప్షన్ పెట్టాడు. అమ్మానాన్నలతో దిగిన ఫొటోలను నీరజ్ ఆ పోస్టుకు జత చేశాడు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ అపురూపమైన క్షణాలకు ఫిదా అయిన అభిమానులు.. ఈ ఫొటోలను సేవ్ చేసుకోండని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు.
నీరజ్ చోప్రాకి ఇవి నిజంగా సంతోషకరమైన క్షణాలే. ఎందుకంటే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నీరజ్.. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించాడు. ఫైనల్స్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ త్రో విసిరి చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి గొప్ప అథ్లెట్కు ఇది చిన్న కలే అయినా దాన్ని నిజం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. నీరజ్ ఇంట్లో ఎవరికీ క్రీడా నేపథ్యం లేదు. తండ్రి సతీష్ కుమార్. అమ్మ సరోజ్ బాలలు నీరజ్ కోసం ఎంతో కష్టపడ్డారు. క్రీడాకారుడిగా మారడం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం నీరజ్ తల్లిదండ్రులు తమ కుమారుడి విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు.
గత నెలలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించి భారత దేశంలో అతడో పెద్ద స్టార్ అయ్యాడు. యువతకు ఓ ఆదర్శప్రాయంగా మారాడు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్లో ఒక్క పతకం కూడా సాధించని భారత్.. నీరజ్ చోప్రా పుణ్యమాని చరిత్రను తిరగరాసింది. నీరజ్ బరిసెను అల్లంత దూరానికి విసరి.. విశ్వ వేదికపై భారత జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఫైనల్ పోరులో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. స్వర్ణం గెలిచి భారత్కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 7 పతకాలు కైవసం చేసుకుంది భారత్.
నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామం. నీరజ్ చోప్రా తండ్రి రైతు. చిన్నప్పుడు నీరజ్కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. కానీ 11 ఏళ్ల వయసు అప్పుడే జావెలిన్ మీద ఆసక్తి ఏర్పడింది. పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్.. జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీరజ్కు కూడా జావెలిన్ నేర్చుకోవాలనే కుతూహలం ఏర్పడింది. అలాజజ పంచ్కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి జావెలిన్లో శిక్షణ తీసుకున్నాడు. అతడి తల్లి సరోజ్ గృహిణి. నీరజ్కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ చోప్రా 24 డిసెంబర్, 1997లో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 23 ఏళ్లు.