
ఢిల్లీ: 2021 టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ చోప్రాకు మరో పురస్కారం దక్కనుంది. భారత ప్రభుత్వం చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం ప్రకటించింది. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నీరజ్ చోప్రాను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ పరమ విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించనున్నారు. కాగా ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో భారత్కు బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో రికార్డు స్థాయిలో బల్లేన్ని 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అలాగే నీరజ్ను గతేడాదే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ, ఇతర అవార్డులతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సత్కరించనున్నారు. ఈ 384 అవార్డులలో 12 శౌర్య చక్ర పతకాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ నుంచి విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 122 విశిష్ట సేవా పతకాలు, మూడు బార్ టు సేన పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నావో సేన పతకాలు, 14 వాయు సేన పతకాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన చేతుల మీదుగా విజేతలకు అందించి వారిని శాలువాతో సత్కరించనున్నారు.
కాగా 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా బంగారు పతకం గెలిచిన తర్వాత భారత్కు నీరజ్ చోప్రా రూపంలో వ్యక్తిగత విభాగంలో రెండో బంగారు పతకం వచ్చింది. ఇందుకు గాను నీరజ్ చోప్రాకు భారత ప్రభుత్వం గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందించింది. కాగా ఇండియన్ ఆర్మీలో నీరజ్ చోప్రా జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్గా ఉన్న సంగతి విధితమే.
2021లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో భారత్ అత్యధికంగా 7 పతకాలు గెలుచుకుంది. ఒలింపిక్ చరిత్రలో భారత్కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాతోపాటు మీరాభాయి చాను, రవి కుమార్ దహియా, పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా, భారత పురుషుల హాకీ జట్టు పతకాలు సాధించారు.