హైదరాబాద్: కేంద్ర క్రీడల మంత్రిగా ఏథేన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ స్ధానంలో ఉన్న విజయ్ గోయల్ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దీంతో కేంద్ర క్రీడల మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ అరుదైన ఘనత సాధించారు. ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే మొదటిసారి.
వివరాల్లోకి వెళితే... ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రిమండలిని పునర్ వ్యవస్థీకరించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా 9 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరో నలుగురు సీనియర్ మంత్రులకు కేబినెట్ హోదా కల్పించారు.
ఆదివారం ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముందు వరకు 47 ఏళ్ల రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు.

రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ఏథేన్స్ ఒలింపిక్స్లో షూటింగ్లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలిచారు. కామన్వెల్త్, ఆసియా గేమ్ల్లో కూడా షూటింగ్ విభాగంలో పలు పతకాలను గెలిచారు. 2004-05 సంవత్సరానికి గాను క్రీడల్లో విశేష సేవలు అంధించినందుకు గాను ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్నారు.
ఆ తర్వాత రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2005లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో జన్మించిన రాథోర్ 2013లో కల్నల్గా ఆర్మీ నుంచి రిటైరయ్యారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జైపూర్ రూరల్ స్ధానం నుంచి ఎంపీగా గెలిచారు.
క్రీడాకారులందరికీ ఉత్తమ అవకాశాలు కల్పిస్తామని, తద్వారా దేశాన్ని క్రీడారంగంలో పటిష్టంగా తీర్చిదిద్దుతామని కేంద్ర క్రీడా శాఖమంత్రిగా ఆదివారం నియమితులైన రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ స్పష్టం జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అన్ని స్థాయిల్లో పత కాలు సాధించడమే తమ ధ్యేయంగా ప్రక టించారు. 'గ్రామస్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ పతకాలు గెలుపొందడమే లక్ష్యంగా నిర్దేశించుకుంటాం. క్రీడలు రాష్ట్ర పరిధిలోని వి అయినందున రాష్ర్టాలతో సమన్వయం చేసుకొని ఆటగాళ్లందరికీ ఉత్తమ అవకాశా లు కల్పించేందుకు చర్యలు చేపడతాం' అని రాథోర్ తెలిపారు.