భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ, మేనమామ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరియాణాలోని చర్ఖీ దాదరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మను భాకర్ అమ్మమ్మ, మేనమామ ప్రయాణిస్తోన్న బైక్ ను ఓ కారు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం అందింది. ప్రస్తుతానికి కారు నడిపిన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మను భాకర్ అమ్మమ్మ, మేనమామ డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం సివిల్ హాస్పిటల్ కు తరలించారు.
"మాకు కారు, బైక్ ఢీ కొన్నాయి అని యాక్సిడెంట్ గురించి తెలియగానే ఘటన స్థలానికి వెళ్లాం. స్కూటీ మీద ప్రయాణించిన ఇద్దరు చనిపోయారు. అయిత ఘటనా స్థలంలో కార్ డ్రైవర్ లేడు. అతడు పరారీలో ఉన్నాడు" అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

కాగా, ఒకే ఒలింపిక్స్లో భారత్కు రెండు మెడల్స్ సాధించిన షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాన్ని అందుకుంది.
ఫిర్యాదు చేసిన మను భాకర్
పారిస్ ఒలింపిక్స్లో విజేతలకు ఇచ్చిన మెడల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ అథ్లెట్ల నుంచి ఫిర్యాదులు వస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మను భాకర్ కూడా తన పతకంపైనున్న పూత తొలగిపోతోందని కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఫిర్యాదులపై ఇప్పటికే స్పందించిన ఐఓసీ, త్వరలోనే వాటి స్థానంలో కొత్తవి అందిస్తామని ప్రకటించింది.