
జొహాన్నెస్బర్గ్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారితో పోరాడుతున్నా అని దక్షిణాఫ్రికా ప్రముఖ స్విమ్మర్ కామెరాన్ వాండర్బర్గ్ తెలిపాడు. వైరస్ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది, ఇంత దారుణమైన వైరస్ను నేను ఎప్పుడూ ఎదుర్కొలేదు అని చెప్పాడు. కరోనా వైరస్ను దీటుగా ఎదుర్కొనేది యువత మాత్రమే అనుకున్నాం. ఈ విషయంను డాక్టర్లు కూడా చెబుతున్నారు. కరోనా బారిన పడ్డ యువత తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే కోలుకుంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అయితే అలాంటి అలసత్వం అసలు పనికిరాదని వాండర్బర్గ్ అంటున్నాడు.
రియో (2016) ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన వాండర్ వాండర్బర్గ్ ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి కోలుకుంటున్న ఈ స్విమ్మర్ తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. 'గత 14 రోజులుగా కరోనాతో పోరాడుతున్నా. మొదట్లో జ్వరం తీవ్రంగా వేధించింది. శారీరక అలసట మాత్రం నన్ను ఇంకా వేధిస్తున్నది. కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుంది. నా వయసు 31. నేనేప్పుడు ధూమపానం జోలికి పోలేదు. అయినా వైరస్ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంత దారుణమైన వైరస్ను ఎప్పుడూ ఎదుర్కొలేదు' అని వాండర్బర్గ్ అన్నాడు.
అర్జెంటీనా స్ట్రయికర్, జువెంటస్ ఆటగాడు పౌలో డైబాల, ఏసీ మిలాన్ మాజీ డిఫెండర్ పౌలో మల్డీని కరోనా బారిన పడ్డారు. తనతోపాటు గాళ్ఫ్రెండ్ ఒరినా సబాని కూడా కరోనా పాజిటివ్గా తేలిందని డైబాల ట్వీట్ చేశాడు. అయితే, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపాడు. కాగా, మల్డీనీతోపాటు అతడి కుమారుడు డానియెల్కు కూడా వైరస్ సోకింది. వీరిద్దరూ క్వారంటైన్ను పూర్తి చేసుకున్నట్టు ఏసీ మిలాన్ క్లబ్ ప్రకటించింది.
రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లోరెంజో శాంజ్ కరోనా వైరస్తో మరణించాడు. 76 ఏళ్ల శాంజ్ 1995-2000 మధ్య మాడ్రిడ్ అధ్యక్షుడిగా పని చేశాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చామని.. చికిత్స పొందుతూ శాంజ్ మరణించాడని అతడి కుమారుడు చెప్పాడు. ఓ క్రికెట్ ఆటగాడికి కూడా కరోనా సోకినా విషయం తెలిసిందే.
పంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. అయినా దీన్ని కట్టడి చేయడం సాధ్యమేనని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు దాటగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ట్రెడ్రోస్ అధనోమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫుట్బాల్ ఆటలో కేవలం డిఫెండ్ మాత్రమే కాకుండా అటాక్ కూడా చేస్తేనే గెలుస్తామని అదే స్ఫూర్తితో కరోనాపై కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.