
హిగాషిమత్సుషిమ (జపాన్): ఒలింపిక్ జ్యోతి గ్రీసు నుంచి శుక్రవారం జపాన్కు చేరుకుంది. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అసలు ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనుమానాల నేపథ్యంలో స్వాగత కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. ఓ ప్రత్యేక లాంతరులో ఒలింపిక్ జ్వాలను ఉంచి విమానంలో తీసుకొచ్చారు. అయితే కరోనా కారణంగా స్వాగత వేడుకలకు రావాల్సిన 200 మంది పాఠశాల విద్యార్థులను ఆహ్వానించలేదు. ఒలింపిక్ జూడో మాజీ ఛాంపియన్స్ సవోరి యోషిద, తదాహిరో నౌమురాలు కొద్ది మంది అధికారుల సమక్షంలో క్వాల్డ్రన్ను వెలిగించారు.
జపాన్లో జ్యోతి యాత్ర మార్చి 26న ఆరంభమవుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆటలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జులై 24న ఒలింపిక్స్ ఆరంభం కావడం కూడా అనుమానంగానే ఉంది. క్రీడలను వాయిదా వేయాలనే డిమాండు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా జపాన్ ఒలింపిక్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు యమగూచి కూడా ఒలింపిక్స్ను వాయిదా వేయాలని అన్నాడు.
ఒకవైపు కరోనా వైరస్ ఆందోళన కలి గిస్తున్నా.. టోక్యో ఒలింపిక్స్ను షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు.
సంప్రదాయాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని మేళవిస్తూ టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్ను రూపొందించారు.టార్చ్ జపనీయులకు ఎంతో ప్రీతిపాత్రమైన చెర్రీ బ్లాసమ్ పువ్వును తలపిస్తుంది. 2011 భూకంపం తర్వాత తాత్కాలికంగా ఇళ్లను నిర్మించారు. ఆ నిర్మాణ వ్యర్థాల నుంచి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీసిన అల్యూమినియాన్ని టార్చ్ తయారీలో ఉపయోగించారు. చెర్రీ బ్లాసమ్ పువ్వులో 5 రేకులకు చిహ్నంగా టార్చ్లో 5 జ్వాలలు వచ్చేలా రూపొందించారు. ఆ అయిదు జ్వాలలు టార్చ్ మధ్యలో ఏకమై మండుతాయి.
తేలిగ్గా పట్టుకోవడానికి వీలుగా టార్చ్ గ్రిప్, ఆకారాన్ని రూపొందించారు.