న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల కేసు కొలిక్కి రావట్లేదు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేదు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది.
ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్పై వెల్లువెత్తాయి.

ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన కొనసాగిస్తోన్నారు. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకుంటామంటూ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వారు నిరసనలను నిలిపివేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి జనవరిలో మేరీకోమ్ సారథ్యంలో అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది.
నాలుగు వారాల్లోగా నివేదికను అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదు. రోజులు గడుస్తున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోవడంతో మరోసారి నిరసన దీక్షలకు దిగారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు.
వారి నిరసన దీక్షలకు క్రమంగా మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్లు మద్దతు పలికారు. వారితో కలిసి జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలుస్తోన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తక్షణమే ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది.
తాజాగా- ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కూడా నిరసనకారులతో జత కలిశారు. రెజ్లర్లకు అండగా నిలిచారు. వారికి న్యాయం చేయాలంటూ ఎలుగెత్తారు. న్యాయం కోసం తన తోటి అథ్లెట్లు రోడ్డెక్కడం కలచి వేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతదేశం గర్వించేలా ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలిచిన అథ్లెట్లు న్యాయం కోసం పోరుబాట పట్టడం బాధాకరమని పేర్కొన్నారు.
అథ్లెట్లకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ రక్షణ, భద్రతను కల్పించాల్సిన బాధ్యత ఈ దేశంపై ఉందని గుర్తు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదొక సున్నితమైన అంశమని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. బాధితులైన రెజ్లర్లకు సత్వర న్యాయం అందించాలని పేర్కొన్నారు.