అక్లాండ్: భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఉన్న హోటల్ రూంలోకి మీడియాను అనుమతించడం లేదు. ఈ ప్రపంచ కప్ సమయంలో విరాట్ కోహ్లీ ఓ జర్నలిస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం... బీసీసీఐ మీడియాతో కొంత సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విరాట్ కోహ్లీ ఘటన తర్వాత బీసీసీఐ ఓ ప్రకటన కూడా చేసింది.
అడిలైడ్, మెల్బోర్న్, పెర్త్, హామిల్టన్ తదితర నగరాల్లో భారత క్రికెట్ జట్టు ఉన్న సమయంలో హోటలా లాబీలోకి మీడియాను హోటల్ సిబ్బంది అనుమతించింది. అయితే, అక్లాండులోని క్రికెటర్లు ఉన్న హోటల్లోకి ఇప్పుడు మీడియా సిబ్బందిని అనుమతించడం లేదని తెలుస్తోంది. మీడియాను వంద మీటర్ల దూరంలో ఉంచుతున్నారని తెలుస్తోంది.

అయితే, మీడియాను అనుమతించవద్దని బీసీసీఐ మేనేజ్ మెంట్ లేదా ఆటగాళ్లు చెప్పారా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. లేక హోటల్ సిబ్బందే అలా చేస్తున్నారా తెలియాల్సి ఉంది. పలువురు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు చిత్రీకరిస్తుండగా.. హోటల్ సిబ్బంది వారికి వద్దని సూచించింది.
హోటల్ సెక్యూరిటీ స్టాఫ్ వచ్చి ఇక్కడ నుండి వెళ్లి పోవాలని చెప్పారు. మీరు ఉన్న ప్రాంతం తమ పరిధిలో లేదని, ఇక్కడ ఉండవద్దని చెప్పారని తెలుస్తోంది. అయితే, తాము హోటల్ లాబీలోకి వస్తామని చెప్పినప్పటికీ.. హోటల్ సిబ్బంది నిరాకరించారని తెలుస్తోంది.