రియో డి జెనీరో: బ్రెజిల్లోని రియో డి జెనీరో 33వ ఒలింపిక్స్కు సిద్ధమైపోయింది. ప్రపంచాన్ని ఒక్కచోటికి చేర్చే ఈ అద్భుత క్రీడా సంబరం శుక్రవారం ప్రారంభమవుతోంది. 206 దేశాలు.. 10,500 మంది క్రీడాకారులు ఒకే వేదికలో పోటీ పడే మహా క్రీడల కుంభమేళా ఇది.
బ్రెజిల్ నగరం రియో డి జెనీరోలో స్థానిక కాలమానం ప్రకారం ఒలింపిక్స్ వేడుకలు శుక్రవారం (ఆగస్టు 5న) శ్రీకారం చుట్టుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మారకానా స్టేడియంలో ఆరంభోత్సవం జరుగుతుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్ క్రీడలు అసలుసిసలైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం.
క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలో ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే గ్రీకు కూడా అనేక చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేవి. వీటి మధ్య తరచు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. క్రీడల వల్లే శాంతి స్థాపన సాధ్యమని గ్రహించిన గ్రీకులు క్రీస్తుపూర్వం 776లో మొదటిసారి భారీ క్రీడాపోటీలను నిర్వహించారు.
అప్పటి నుంచి క్రీస్తుశకం 393 వరకూ ప్రతి నాలుగేళ్లకోసారి ఒలింపిక్ క్రీడలు జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పరుగు పందెం, కుస్తీ, బాక్సింగ్, గ్రురం స్వారీ, విలువిద్య వంటి పలు అంశాల్లో పోటీలు ఉండేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఒలింపిక్ క్రీడలను నిషేధించడంతో ఒక గొప్ప క్రీడోత్సవానికి తెరపడింది. ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన ఒలింపస్ పట్టణం తర్వాతి కాలంలో భూకంపాల కారణంగా శిథిలమై నామరూపాలు లేకుండా పోయింది.
అయితే, గ్రీకులో పురాతత్వశాఖ జరిపిన తవ్వకాల్లో ఆనాటి ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన ఎన్నో విశేషాలు బహిర్గతమయ్యాయి. క్రీడాలోకానికి దిశానిర్దేశనం చేశాయి. ఫ్రాన్స్కు చెందిన క్రీడా పండితుడు పియరీ డి కోబర్టీన్కు ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలన్న ఆలోచన కలిగింది. 1892లో మళ్లీ ఒలింపిక్స్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి, తన కలను నిజం చేయడానికి విశేషంగా కృషి చేశాడు. ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన ప్రాంతంలోనే 1896లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం విశేషం.

రియో సిద్ధం
ఒలింపిక్స్ కోసం రియో నగరం అందంగా ముస్తాబైంది. సమస్యలను అధిగమిస్తూ, వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, అభిమానులకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమైంది. కుడివైపు టూ బ్రదర్స్, ఎడమ వైపు కోర్కొవాడో, మధ్యన సుగర్లూఫ్ పర్వత శ్రేణులు అందంగా కనిపిస్తుంటే, క్రీస్ట్ ది రిడీమర్ భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మున్సిపాలిటీలో 1,221 కిలోమీటర్లు, మెట్రోలో 4,557 కిలోమీటర్ల విస్తీర్ణంగల రియో జనాభా సుమారు 65 లక్షలు. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు 207 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు ఇప్పటికే రియో చేరుకున్నారు. దాదాపు అదే సంఖ్యలో అధికారులు, అభిమానులు కూడా రియోలో అడుగుపెడుతున్నారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఒలింపిక్స్ను విజయవంతం చేసేందుకు బ్రెజిల్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది.
ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబాని
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ అరుదైన రికార్డు సాధించారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ఐఓసీలో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళగా 52ఏళ్ల నీతా ఘనత సాధించారు. 70 ఏళ్ల వయసు వరకు ఆమె ఐఓసీ సభ్యురాలిగా ఉంటారు.
ఐఓసీ 129వ సమావేశంలో ఆమె ఎంపిక జరిగింది. నీతా అంబానీ ఇటీవలే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు కూడా. దీంతో ఈమె ఈ పోస్ట్కు గత జూన్లో నామినేట్ అయ్యారు. ఓలింపిక్ అజెండా 2020 ఆధారంగా కొత్త సభ్యుల ఎంపిక జరిగింది. విద్య, క్రీడలు, ఆరోగ్యం, కళలు, సంస్కృతి రంగాల్లో నీతా అంబానీ అనేక కార్యక్రమాలు చేపడ్తున్నారు.
తనను ఐఓసీ సభ్యురాలిగా ఎంపిక చేయడంపై నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ మహిళలకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా క్రీడాకారులకు మద్దతుగా ఉంటానని నీతా అంబానీ చెప్పారు. గతంలో దొరాబ్జీ టాటా ఐఓసీ సభ్యుడిగా ఉన్నారు. రాజా రణ్ధీర్ సింగ్ 2000-2014 ఇంటర్నేషనల్ బాడీలో గౌరవ సభ్యుడిగా కొనసాగారు.