
కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భారత స్క్వాడ్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో నిర్ణయం జరిగింది. టేబుల్ టెన్నిస్ సూపర్ స్టార్ అచండ శరత్ కమల్, బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ క్లోజింగ్ వేడుకలో భారత ఫ్లాగ్ బేరర్లుగా స్క్వాడ్ను నడిపించనున్నారు. మన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్.. ప్రపంచ వేదికపై ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించబోతుండడం తెలంగాణకు గర్వకారణమనే చెప్పాలి.
ఇక అంతకుముందు ఓపెనింగ్ సెర్మనీలో కూడా మన తెలుగు తేజం పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అత్యున్నత టోర్నీలో మన తెలుగు వారు దేశ జెండాను మోసే గొప్ప గౌరవాన్ని దక్కించుకోవడం పట్ల మనమందరం గర్వించాలి.
ఇకపోతే 40ఏళ్ల శరత్ కమల్ ఈ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను పురుషులు, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించాడు. అలాగే పురుషుల డబుల్స్లో రజతం గెలుచుకున్నాడు. అలాగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో శరత్ కమల్ గోల్డ్ మెడల్ సాధించాడు.
బాక్సింగ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖత్ ఈ క్రీడల్లో దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఆదివారం జరిగిన 50కేజీల లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో భారత్కు స్వర్ణం సాధించింది. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్.. బాక్సింగ్లో అంచెలంచెలుగా ఎదిగింది. మధ్యలో మేరీ కోమ్ లాంటి దిగ్గజంతో ఆమెకు కొన్ని విభేదాలు వచ్చినా.. ప్రస్తుతం అన్ని సర్దుకున్నాయి. ప్రస్తుతం బాక్సింగ్లో భారత మేటీ స్టార్గా ఆమె వెలుగొందుతుంది. ఇక కామన్ వెల్త్ గేమ్స్ ముగింపు కార్యక్రమంలో నిఖత్ జరీన్, శరత్ కమల్ భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారని టీం చీఫ్ రాజేష్ భండారీ పీటీఐతో తెలిపారు.