గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో అనూహ్యంగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 53 కిలోల విభాగంలో పతకం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపీగా తేలింది. డోప్ పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో చికా పతకాన్ని రద్దు చేశారు.
దాంతో ఇదే విభాగంలో కాంస్యం గెలిచిన తెలుగుతేజం మత్స సంతోషితో పాటు నాలుగో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్ స్వాతి సింగ్కు కలిసి వచ్చింది. సంతోషికి రజత పతకాన్ని, స్వాతి సింగ్కు కాంస్య పతకాన్ని ప్రకటించారు. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం కొండవెలగడ.
కాగా, కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు చెందిన సుశీల్ కుమార్ సెమీ ఫైనల్కు చేరాడు. రెజ్లింగ్ పురుషుల 74 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో ఆయన సెమీస్కు చేరాడు. పురుషుల రాపిడ్ ఫైర్ పిస్టల్ 25 మీటర్ల విభాగంలో భారత క్రీడాకారుడు హరిప్రీత్ సింగ్కు రజతం దక్కింది.
ఇదిలావుంటే, తెలుగు తేజం, ఒరిస్సాకు చెందిన కత్తుల రవికుమార్ రజత పతకం గెల్చుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన 77 కిలోల విభాగం ఫైనల్లో రవికుమార్ మొత్తం 317 (142+175) కిలోల బరువెత్తి వెండి పతకాన్ని అందుకున్నాడు.
తమిళనాడుకు చెందిన సతీష్ శివలింగం 328 కిలోలతో (149+179) స్వర్ణం గెల్చుకుని కామన్వెల్త్ రికార్డు బద్దలుకొట్టాడు. ఆస్ర్టేలియాకు చెందిన ఇటౌండికి (314) కాంస్యం దక్కింది.