లండన్: ఆస్ట్రేలియా టెన్నిస ప్లేయర్ నిక్ కిర్గియోస్ మరోసారి తన అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ రెండోరౌండ్లో ఓటమి తర్వాత ప్రేక్షకులతో గొడవకు దిగడంతో అతనిపై ఎనిమిది వారాల నిషేధంతోపాటు 16,500 డాలర్లు జరిమానాను అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ (ఏటీపీ) విధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారత కరెన్సీలో దీని విలువ రూ.11.02 లక్షలకు సమానం. షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఉద్దేశపూర్వకంగా ఓటమిపాలయ్యాడన్న ఆరోపణలతో అతడిపై ఏటీపీ చర్యలు తీసుకుంది. అంతేకాదు నిక్ కిర్గియోస్ సాధ్యమైనంత త్వరగా క్రీడా సైకాలజిస్టును కలవాలని కూడా ఆదేశించింది.

సైకాలజిస్ట్ సూచనలు పాటించి తన ప్రవర్తనను మార్చుకుంటే నిక్పై ఉంచిన నిషేధాన్ని మూడు వారాలకు కుదిస్తామని తెలిపింది. కొన్ని రోజుల పాటు క్రీడా సైకాలజిస్టు సమక్షంలోనే మ్యాచ్లు ఆడాలని ఏటీపీ సూచించింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకులో 14వ స్థానంలో ఉన్న నిక్ గత బుధవారం షాంఘై మ్యాచ్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ ఓటమి అసహనంలో చైర్ అంపైర్పై గొడవకు దిగడమే కాకుండా అక్కడి ప్రేక్షకులపై కూడా నోరు పారేసుకున్నాడు. ఇలా వరుసగా తన అనుచిత ప్రవర్తనతో ఆటకే తలవంపులు తెస్తున్నాడని నిక్పై ఏటీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిస్ కెర్మోడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో కూడా పలుమార్లు కిర్గియోస్ ఏటీపీ 28 రోజుల పాటు నిషేధం విధించింది.