ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్ని సైలెంట్ గా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. అయితే తాజాగా నీరజ్ ఎంత కట్నం తీసుకున్నాడో వివరాలు బయటకు వచ్చాయి. నీరజ్కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ ఈ విషయాన్ని బయట పెట్టారు. తమ అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రేమ పెళ్లి
"దేవుడి దయ వల్ల మా అమ్మాయికి, దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తి నీరజ్ చోప్రాతో పెళ్లి జరిగింది. నీరజ్, హిమానీలకు ముందు నుంచే పరియం ఉంది. అయితే, ఇరు కుటుంబాల అనుమతి తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు" అని మీనా మోర్ తెలిపారు.

కట్నకానుకలు ఏం తీసుకున్నాడంటే?
తమ అల్లుడు కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు హిమానీ తల్లిదండ్రులు. ఇక ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు తీసుకోలేదని పేర్కొన్నారు. పెళ్లి కూతురికి పుట్టింటి నుంచి ఇచ్చే దుస్తులు, వస్తువులు కూడా తీసుకోలేదని తెలిపారు. అని అల్లుడిపై పొగడ్తల వర్షం కురిపించారు.
హిమానీ ఎవరంటే
నీరజ్- హిమానీల పెళ్లి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తైంది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. నీరజ్ భార్య పేరు హిమానీ. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. హిమానీ హరియాణాలోని లార్సౌలీ ప్రాంతానికి చెందిన యువతి. పానిపట్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. దిల్లీ యూనివర్శిటీలోని మిరాండా హౌస్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది.
అమెరికాలో చదువు
ప్రస్తుతం అమెరికాలో స్పోర్ట్స్ కు సంబంధించి చదువుకుంటోంది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ఇన్ సైన్స్ చేస్తోంది. ఫ్రాంక్లిన్ పీర్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్గా పనిచేసింది. మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. ప్రస్తుతం ఆమె.. తాను గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలేజ్ లోనే ఓ టెన్నిస్ టీమ్ ను మేనేజ్ చేస్తోంది.