భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు కొత్త కోచ్ వచ్చాడు. ప్రముఖ జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీ నీరజ్కు కోచ్గా బాధ్యతలు అందుకున్నాడు. ఇకపై ఈ బల్లెం వీరుడు జాన్ బెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకోనున్నట్లు తెలిపాడు. గత అయిదేళ్లుగా నీరజ్ చోప్రాకు క్లాస్ బార్టోనీజ్ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబ కారణాలతో కోచ్ బాధ్యతల నుంచి 75 ఏళ్ల బార్టోనీజ్ తప్పుకున్నాడు.
కోచ్గా బార్టోనీజ్ తప్పుకోవడంపై నీరజ్ చోప్రా భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఆటగాడిగా, వ్యక్తిగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి బార్టోనీజ్ కోచ్గా ఎంతో కృషి చేశారని చెప్పాడు. గాయంతో ఇబ్బంది పడిన రోజుల్లో, ఎత్తుపల్లాలో తనకు ఎంతో అండగా నిలిచారని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. బార్టోనీజ్ శిక్షణలో నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచాడు.

టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. అంతేగాక ప్రపంచ ఛాంపియన్గా, డైమండ్ లీగ్ ఛాంపియన్గా నిలిచాడు. కాగా, కోచ్ బాధ్యతలు అందుకున్న జాన్ బెలెజ్నీ జావెలిన్లో ప్రపంచ రికార్డులు నమోదుచేశాడు. 1992, 1996, 2000 ఒలింపిక్స్లో బెలెజ్నీ పతక విజేతగా నిలిచాడు. జెకియా లెజెండ్ బెలెజ్నీ 1996లో జర్మనీలో 98.48 మీటర్లు బల్లెం విసిరి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.
కాగా, బెలెజ్నీ నుంచి శిక్షణ పొందడంపై నీరజ్ ఉత్సుకతతో ఉన్నాడు. తన కెరీర్లోని ఓ ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, నీరజ్ చోప్రా మెరుగైన సాధన కోసం ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది పోటీల కోసం దక్షిణాఫ్రికాలోని పాచ్ఫస్ర్టోమ్లో నీరజ్ 31 రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నాడు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్కు ముందు కూడా పాచ్ఫస్ర్టోమ్లోనే నీరజ్ శిక్షణ తీసుకున్నాడు.