
ముంబై: పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్పై ఆరోపణలు చేస్తున్న నెటిజన్లకు టోక్యో ఒలింపిక్స్ 2020 గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మీ సొంత లాభం కోసం నా పేరు వాడుకోవద్దని హెచ్చారించాడు. తప్పుడు ప్రచారం కోసం తన పేరు వాడుకోవద్దని సూచించాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా గురువారం ఓ వీడియోను విడుదల చేశాడు. గోల్డ్ మెడల్ గెలిచి వచ్చినప్పటి నుంచీ నీరజ్ చోప్రా సన్మాన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యానికి కూడా గురయ్యాడు. ప్రస్తుతం కోలుకున్న నీరజ్.. ట్విట్టర్ ఖాతాలో సందడి చేస్తున్నాడు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా.. ఫైనల్స్కు ముందు పాకిస్తాన్ జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ నుంచి జావెలిన్ అందుకుని విసిరాడు. ఇదే విషయాన్ని ఇటీవల నీరజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'ఎంత వెతికిన నా జావెలిన్ కనిపించలేదు. అయితే సడెన్గా అది పాకిస్థాన్కు చెందిన నదీమ్ అర్షద్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు. ఈ గందరగోళం వల్లే తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చింది' అని నీరజ్ పేర్కొన్నాడు.
ఆ ఇంటర్వ్యూ అనంతరం పలువురు నెటిజన్లు అర్షద్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీరజ్ జావెలిన్ను అర్షద్ దొంగిలించేందుకు యత్నించడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీరజ్ స్పందించాడు. 'జావెలిన్ను ఎవరైనా వాడొచ్చు. అక్కడ తనదీ అంటూ ఉండదు. కానీ కొందరు నా పేరుతో తప్పుడు ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. వారి ఎజెండా కోసం నా పేరును వాడుకుంటున్నారని తెలిసింది. దయచేసి అలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి. క్రీడలు కలిసుండాలని మాకు నేర్పుతాయి. మేం కూడా స్నేహంగా మాట్లాడుకుంటాం. ఈ ప్రచారం నన్నెంతో బాధించింది' అంటూ నీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
బుధవారం బాలీవుడ్ స్టార్ రణ్దీప్ హుడాని నీరజ్ చోప్రా కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్దీప్ హుడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్లో కలుసుకున్న నీరజ్, రణ్దీప్.. తెల్లని దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఆ సమయంలో ఈ ఇద్దరు స్టార్లు వైరైటీ పోజు ఇచ్చారు. వీరిద్దరూ చాలా సమయం మాట్లాడుకున్నారట.
నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 7 పతకాలు కైవసం చేసుకుంది భారత్.