Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకం సాధిస్తాడని ఆశించిన భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా పతకం సాధించకుండా అభిమానులను నిరాశపరిచాడు. టోక్యోలో జరిగిన ఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. దానికి కారణాన్ని నీరజ్ చోప్రా స్వయంగా వెల్లడించాడు. రెండు వారాల క్రితం చెక్ రిపబ్లిక్లో శిక్షణ తీసుకుంటుండగా వెన్నుకు గాయమైనట్లు నీరజ్ తెలిపాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు నీరజ్ స్వయంగా తెలిపాడు. వెన్నునొప్పి కారణంగానే తీవ్ర ప్రభావం పడిందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారి కూడా ధ్రువీకరించారు.
శిక్షణలో గాయం
2023లో గోల్డ్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా ఈసారి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఒకానొక దశలో తాను ఈ పోటీలో పాల్గొంటానో లేదో కూడా తెలియదని నీరజ్ తెలిపాడు. సెప్టెంబర్ 4న షాట్ పుట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వెన్నుకు గాయమైంది. "నేను ఫ్రంట్ త్రో కోసం వంగినప్పుడు, నా వెన్ను ఎడమ వైపు ఒక్కసారిగా కండరాలు లాగబడ్డాయి, నడవడానికి కూడా కష్టమైంది," అని నీరజ్ వివరించాడు. ప్రేగ్లో MRI స్కానింగ్ చేయగా, డిస్క్లో కొంత సమస్య ఉందని తేలింది. సెప్టెంబర్ 6న టోక్యోకు చేరుకున్నప్పటి నుంచి ప్రతిరోజు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు.

భారత జావెలిన్ భవిష్యత్తుపై కొత్త ఆశలు
నీరజ్ చోప్రా విఫలమైనా.. భారత జావెలిన్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. సచిన్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచాడు. తన మొదటి ప్రయత్నంలోనే 86.27 మీటర్ల త్రో విసిరి, తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును నెలకొల్పాడు. ఇది ఇండియాలో జావెలిన్ క్రీడ అభివృద్ధి చెందుతోందని సూచిస్తోంది.
నీరజ్ చోప్రా తన వైఫల్యంపై మాట్లాడుతూ, "ఇలా చాలా కాలం తర్వాత జరిగింది. సాధారణంగా నేను ఈ పరిస్థితిని నియంత్రించుకుంటాను. కానీ ఈ రోజు అలా జరగలేదు. ఈ ఫలితాన్ని అంగీకరించి, వచ్చే సీజన్లో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తాను" అని అన్నారు. క్వాలిఫికేషన్లో సులభంగానే త్రోలు వేసినప్పటికీ, ఫైనల్లో ఆ ఫామ్ను కొనసాగించలేకపోయానని నీరజ్ వివరించారు.