వరుసగా రెండు ఒలింపిక్స్లో గోల్డ్, సిల్వర్తో చరిత్ర సృష్టించిన భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్ రాకు తాజాగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది.2024 సంవత్సరానికి గానూ అతడు ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్గా ఎంపికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ 'ట్రాక్ అండ్ ఫీల్డ్' మేటి పురుష జావెలిన్ త్రో అథ్లెట్గా నీరజ్ను సెలెక్ట్ చేసింది. దీంతో అతడు వరుసగా రెండో ఏడాది ర్యాంకింగ్స్లో నెం.1గా నిలిచాడు. కాగా, ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ మ్యాగజైన్ కు 78 ఏళ్ల చరిత్ర ఉంది.
గతేడాది పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన 27 ఏళ్ల నీరజ్, ఈ మ్యాగజైన్ ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)ను వెనక్కినెట్టి ఈ అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు.2023లోనూ నీరజే తొలి స్థానంలో నిలిచాడు.

నిరుడు డైమండ్ లీగ్లో దోహా, లాసానె, బ్రసెల్స్ పోటీల్లో నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఫిన్లాండ్ వేదికగా జరిగిన పావో నూర్మి క్రీడల్లోనూ ఛాంపియన్గా నిలిచాడు.
''అగ్రస్థానం కోసం 2023లో నంబర్వన్ గా నిలిచిన నీరజ్, 2022 విజేత అండర్సన్ మధ్య తేడాను స్పష్టంగా చెప్పలేం. డైమండ్ లీగ్లో నీరజ్ ఛాంపియన్గా నిలవలేదు. కానీ మొత్తంగా 3-2 తేడాతో అండర్సన్ను వెనక్కి నెట్టాడు. అండర్సన్, డైమండ్ లీగ్ మూడు అంచెల పోటీల్లోనూ విజయం సాధించాడు. అయితే పారిస్ ఒలింపిక్స్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేసిన కారణంగా నీరజ్ ముందు నిలిచాడు. మరో టోర్నీలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానం దక్కించుకున్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ అర్షద్ నదీమ్ ఐదో స్థానం కన్నా మెరుగైన ర్యాంకు దక్కించుకోలేకపోయాడు. '' అని మేగజైన్ రాసుకొచ్చింది.
కాగా, పారిస్ ఒలింపిక్స్లో నదీమ్ గోల్డ్ మెడల్, అండర్సన్ బ్రాంజ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. నిరుడు ఒలింపిక్స్ లో కాకుండా నదీమ్ పారిస్ డైమండ్ లీగ్ అంచెలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానంలో నిలిచాడు.