భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా త్రుటిలో గోల్డ్ మెడల్ చేజార్చుకున్నాడు. యూజీన్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ మెరిశాడు. శనివారం జరిగిన ఈ పోటీల్లో 83.80 మీటర్ల బెస్ట్ త్రో విసిరిన నీరజ్ రాణించాడు. కానీ తొలి స్థానానికి కేవలం 0.44 మీటర్ల దూరంలో నిలిచి స్వర్ణ పతకం చేజార్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ యాకూబ్ వాడ్లెక్ ఈ లీగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
యాకూబ్ 84.24 మీటర్ల బెస్ట్ త్రో విసిరాడు. ఫిన్ల్యాండ్కు చెందిన ఆలివర్ హేలాండర్ 83.74 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల నేపథ్యంలోనే నీరజ్ జాగ్రత్త పడ్డాడని, గాయం కాకూడదనే ఆలోచనతో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ లీగ్లో రెండో స్థానంతో నీరజ్ సరిపెట్టుకున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ పోటీలో తన తొలి త్రోనే నీరజ్ ఫౌల్ వేశాడు. రెండోసారి 83.80 మీటర్ల త్రో విసిరి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 81.37 త్రో వేశాడు. నాలుగో ఛాన్సులో మరో ఫౌల్ వేసిన అతను చివరి త్రోలో 80.90 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. అదే సమయంలో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ యాకూబ్ తన తొలి ప్రయత్నంలోనే 84.01 మీటర్ల త్రో విసిరాడు. అయితే ఆ తర్వాత వరుసగా మూడు ఫౌల్స్ వేశాడు.
ఐదో ప్రయత్నంలో 82.58 మీటర్ల త్రో వేసిన అతను.. చివరి ప్రయత్నంలో 84.24 మీటర్ల అత్యుత్తమ త్రోతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిన్లాండ్ ప్లేయర్ ఆలివర్ తన మూడో ప్రయత్నంలో 83.74 మీటర్ల త్రో విసిరి మూడో స్థానం సాధించాడు. ఈ లీగ్ ప్రారంభానికి ముందు కూడా నీరజ్ పూర్తి ఫిట్గా లేడని వార్తలొచ్చాయి. అతను భుజం నొప్పితో బాధ పడుతున్నట్లు తెలిసింది. అయితే డైమండ్ లీగ్ ఫైనల్ సమయానికి అతను పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనే విషయం తెలియదు.