హైదరాబాద్: ఆసియా గేమ్స్లో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని మాజీ ప్రధాని, దివంగత వాజ్పేయీకి అంకితమిస్తున్నానని నీరజ్ చోప్రా చెప్పాడు. ఆసియా గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత తొలి జావెలిన్ త్రోయర్గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ జావెలిన్ను 88.06 మీటర్ల దూరం విసిరిన సంగతి తెలిసిందే. అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ "నేను గెలిచిన ఈ స్వర్ణ పతకాన్ని మాజీ ప్రధాని, దివంగత వాజ్పేయీకి అంకితమిస్తున్నా" అని అన్నాడు.
చైనాకు చెందిన లియు కిజెన్ (82.22మీ) రజతం నెగ్గగా... 80.75 మీటర్లతో అర్షద్ నదీమ్ (పాకిస్థాన్) కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఆసియా గేమ్స్లో జావెలిన్ త్రో పతకం సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ నిలిచాడు. ఇంతకుముందు 1982 ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో గుర్తేజ్ సింగ్ కాంస్యం గెలిచాడు.
ఆసియా గేమ్స్: జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని దక్కించుకున్న నీరజ్ చోప్రా
సోమవారం 83.46 మీటర్లతో పోటీని ఆరంభించిన అతడు.. రెండో ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. తన మూడో ప్రయత్నంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (88.06) చేశాడు. ఈ క్రమంలో అతడు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.43 మీ)ను బద్దలు కొట్టాడు. నీరజ్ మరో మూడు ప్రయత్నాలు చేసినా మూడోదే అతడి అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
జూనియర్ ప్రపంచ రికార్డు (86.48) నెలకొల్పిన నీరజ్.. ఈ సీజన్లో నిలకడగా 85మీటర్ల మైలురాయిని దాటాడు. నీరజ్ చోప్రా నిలకడగా రాణించడం చూస్తోన్న 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్లో అతడు తప్పక పతకం సాధిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే ఆసియా గేమ్స్లో స్వర్ణం గెలిచిన రెజ్లర్ భజరంగ్ పునియా కూడా తన పతకాన్ని వాజ్పేయీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వుషూలో కాంస్యం గెలిచిన సూర్య భాను కూడా తన పతకాన్ని జమ్ము కశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన జవాన్లు, వారి కుటుంబసభ్యులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు.