
పురుషుల జావెలిన్ త్రోలో డైమండ్ లీగ్ సిరీస్ ముగింపులో ప్రతిష్ఠాత్మక టైటిల్ అయిన డైమండ్ ట్రోఫీని గెలుచుకున్న మొదటి భారతీయుడుగా నీరజ్ చోప్రా నిలిచి భారత్కు గర్వకారణంగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్ పతక విజేత అయిన నీరజ్.. డైమండ్ ట్రోఫీ పోటీలో 88.44మీటర్ల మేర జావెలిన్ విసిరి ట్రోఫీని ఒడిసిపట్టాడు. నీరజ్ చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వడ్లెజ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్లను అధిగమించి చరిత్ర నెలకొల్పాడు. తొలుత నీరజ్ ఫౌల్తో ప్రారంభించాడు. వడ్లెజ్చ్ 84.15మీటర్ల త్రోతో మొదటి ప్రయత్నంలోనే ఆధిక్యంలోకి వచ్చాడు. అయితే నీరజ్ తన 2వ ప్రయత్నంలో 88.44మీటర్లు విసిరాడు. ఇక అన్ని రౌండ్లు ముగిసేవరకు ఎవరూ ఇంత దూరం విసరలేదు.
నీరజ్ తన 3వ ప్రయత్నంలో 88.00మీటర్లు, 4వ ప్రయత్నంలో 86.11మీటర్లు, 5వ ప్రయత్నంలో 87.00మీటర్లు, చివరి ప్రయత్నంలో 83.60మీటర్లు విసిరాడు. వడ్లేజ్ 86.94మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో 2వ స్థానంలో నిలిచాడు.
నీరజ్ 2021లో ఒలింపిక్ స్వర్ణం, 2018లో ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, 2022లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం పతకాలు సాధించి భారత గోల్డ్ బాయ్గా మారాడు. తన ఖాతాలో డైమండ్ ట్రోఫీని కూడా గెలవాలని అతను ఆ మధ్య చెప్పాడు. అనుకున్నది సాధించాడు.