అథ్లెటిక్స్ ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్లో భారత స్టార్ జావెలిన్ త్రో నీరజ్ చోప్రా సెంటీమీటర్ తేడాతో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. 0.01 మీటర్ల వెనుకంజతో రన్నరప్గా నిలిచాడు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పోటీలో నీరజ్87.86 మీటర్ల దూరాన్ని ఈటెను విసిరాడు. తన మూడో ప్రయత్నంలో ఈ అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు.
అయితే ఈ పోటీలో తాను విరిగిన చేతితో బరిలోకి దిగానని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ఈ వారం ప్రారంభంలో శిక్షణ సమయంలో తన ఎడమచేతికి ఫ్రాక్చర్ అయ్యిందని ట్విటర్ వేదికగా తెలిపాడు. ''2024 సీజన్ ముగింపుతో నేను నేర్చుకున్న... పురోగతి, ఎదురుదెబ్బలు, మానసిక స్థైర్యాన్ని తిరిగి చూసుకుంటున్నాను. సోమవారం ప్రాక్టీస్లో గాయపడ్డాను. స్కానింగ్లో నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయ్యిందని తెలిసింది''

''ఇది నాకు మరో బాధాకరమైన సవాలు. కానీ నా టీమ్ సహాయంతో బ్రస్సెల్లో పోటీకి పాల్గొనగలిగాను. ఈ ఏడాదిలో ఇది చివరిపోటీ. దీంతో ట్రాక్లో ముగించాలనుకున్నా. అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఎంతో నేర్చుకున్నాను. ఇక పూర్తి ఫిట్నెస్ సాధించడానికి సిద్ధంగా ఉన్నాను . మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఈ 2024 నన్ను మంచి అథ్లెట్గా, వ్యక్తిగా మార్చింది. తిరిగి 2025లో కలుద్దాం" అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.
బ్రస్సెల్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్లు ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్గా అవతరించాడు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్లో అండర్సన్ పీటర్స్ కాంస్య పతకాన్ని నెగ్గిన విషయం తెలిసిందే. కాగా, ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా సెంటీమీటర్తో టైటిల్ చేజార్చుకున్నాడు.
ఈ ఏడాది డైమండ్ లీగ్ ఫైనల్లో అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 87.87 మీటర్లు, నీరజ్ చోప్రా (భారత్) - 87.86 మీటర్లు, జూలియన్ వెబర్ (జర్మనీ) - 85.97 మీటర్లు, ఆండ్రియన్ మర్దారే (మోల్డోవా) - 82.79 మీటర్లు, జెంకీ డీన్ రోడ్రిక్ (జపాన్) - 80.37 మీటర్లు టాప్-5లో నిలిచారు.
As the 2024 season ends, I look back on everything I’ve learned through the year - about improvement, setbacks, mentality and more.
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 15, 2024
On Monday, I injured myself in practice and x-rays showed that I had fractured the fourth metacarpal in my left hand. It was another painful… pic.twitter.com/H8nRkUkaNM