భారత జావెలిన్త్రో స్టార్ నీరజ్ చోఫ్రా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో మూడో పతకాన్ని సాధించాడు. మంగళవారం ఫిన్లాండ్లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచాడు. ప్రపంచ ఛాంపియన్ నీరజ్ జావెలిన్ను ఉత్తమంగా 85.97 మీటర్లు విసిరి టాప్లో నిలిచాడు. అయితే తొలి రెండు ప్రయత్నాల్లో నీరజ్ వెనుకబడ్డాడు. 83.62 మీటర్లు, 83.45 మీటర్లు విసిరాడు.
మూడో ప్రయత్నంలో ఉత్తమంగా విసిరిన నీరజ్ తర్వాత ప్రయత్నాల్లో మరోసారి 82.12 మీటర్లు, ఫౌల్, 82.97 మీటర్లతో సరిపెట్టుకున్నాడు. కానీ పోటీదారుల కంటే ఎక్కువ దూరం విసరడంతో నీరజ్ పసిడి సాధించాడు. ఫిన్లాండ్ త్రోయర్ టోనీ రజత పతకం అందుకున్నాడు. అతను ఉత్తమంగా 84.19 మీటర్లు విసిరాడు. కాంస్యాన్ని కూడా ఫ్లిన్లాండ్ క్రీడాకారుడే సాధించాడు. అలివర్ జావెలిన్ను 83.96 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

ఇక రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, గ్రెనెడా స్టార్ అండర్సన్ పీటర్స్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతను 82.58 మీటర్లతో ఉత్తమ ప్రదర్శన చేశాడు. కాగా, ఈ సీజన్లో నీరజ్ చోప్రాకు ఇది మూడో పతకం కావడం విశేషం. భువనేశ్వర్లో జరిగిన ఫెడరేషన్ కప్ మీట్లో స్వర్ణం, దోహా డైమండ్ లీగ్ మీట్లో రజతం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ ముంగిట నీరజ్ చోప్రా సూపర్ ఫామ్లో ఉండటం భారత్కు శుభసూచకం.
టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా పసిడి సాధించిన విషయం తెలిసిందే. 87.58 మీటర్లు విసిరి భారత్కు పతకాన్ని అందించాడు. 2018లో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లోనూ; అలాగే 2023 వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్లోనూ నీరజ్ స్వర్ణం సాధించాడు.