పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్స్కు ఫస్ట్టైమ్..
మరోవంక- ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో (Javelin throw) విభాగంలో ఫైనల్స్కు అర్హత సాధించింది. ఇదో నయా రికార్డ్. ఇప్పటిదాకా ఏ థ్రోయర్ కూడా ఈ ఘనతను సాధించలేదు.. భారత్ను ఫైనల్స్ వరకూ తీసుకెళ్లలేదు. అలాంటి అసాధారణ కార్యక్రమాన్ని అవలీలగా పూర్తి చేశాడు.. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra). క్వాలిఫికేషన్స్ రౌండ్లో దుమ్ము దులిపాడు. తొలి ప్రయత్నంలోనే అతను ఏకంగా 86.65 మీటర్ల దూరం వరకు జావెలిన్ను సంధించాడు. ఈ విభాగంలో పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు. ఇదీ రికార్డే.
అంచనాల్లేకుండా బరిలోకి..
ఇది అనూహ్యం. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒత్తిడికి అందకుండా.. దానికి లొంగకుండా నీరజ్ చోప్రా బరిలోకి దిగాడు. విసరడం..విసరడంతోనే ఫైనల్కు అర్హత సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే అతను రికార్డ్ స్థాయి దూరానికి జావెలిన్ను సంధించాడు. గ్రూప్-ఏ విభాగంలో అతనే టాపర్. భారత్ను తొలి స్థానంలో నిలిపాడు నీరజ్ చోప్రా. కాగా గ్రూప్-బీ విభాగంలో శివ్పాల్ సింగ్ నిరాశ పరిచాడు. ఫైనల్స్కు అతను అర్హతను సాధించలేకపోయాడు. జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసరాల్సి ఉంటుంది.. లేదా తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. అలాంటి ఛాలెంజ్ను అతను అలవోకగా అధిగమించాడు.
7న ఫైనల్స్..
నీరజ్ చోప్రా ఏకంగా 86.65 మీటర్లకు పైగా జావెలిన్ను సంధించడంతో ఆటోమేటిక్గా అతను ఫైనల్స్కు అర్హత సాధించినట్టయింది. ఈ కేటగిరీలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ, ఫిన్లాండ్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. కాగా ఫైనల్ ఈవెంట్ ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు పురుషుల జావెలింగ్ థ్రో ఫైనల్స్ ఉంటుంది. నీరజ్ చోప్రా ఫామ్ను కొనసాగించగలిగితే ఫైనల్స్లో కూడా చూపగలిగితే.. భారత్కు మరో పతకం ఖాయమైనట్టే. టాపర్గా నిలవగలిగితే.. భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడే సువర్ణ అవకాశాన్ని అందుకున్నట్టే అవుతుంది.
సోషల్ మీడియా షేక్..
అతని ప్రదర్శన.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వేలాదిమంది ట్వీట్లు, రీట్వీట్లు చేస్తోన్నారు. నీరజ్ చోప్రా, జావెలిన్ థ్రో.. పేర్లు ట్రెండింగ్లో నిలిచాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ సైతం నీరజ్ చోప్రా పెర్ఫార్మెన్స్ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. నీరజ్ చోప్రా జావెలిన్ను సంధించడానికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ను వీరేంద్ర సెహ్వాగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. నీరజ్కు ఇదే తొలి ఒలింపిక్స్. అయినప్పటికీ.. ఏ మాత్రం తొట్రుపాటు పడకుండా.. ఒత్తిళ్లను అధిగమిస్తూ అతను సంధించిన బరిసె లక్ష్యాన్ని అందుకోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.


Click it and Unblock the Notifications
