
హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా నిర్వహించిన నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) మ్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. ఎప్పుడూ టీవీల్లో ఎన్బీఏ స్టార్ల విన్యాసాలు చూసి మురిసిపోయే భారత బాస్కెట్ బాల్ అభిమానులు ఆటగాళ్ల ప్రదర్శన చూసి మురిసిపోయారు.
ముంబై వేదికగా నిర్వహిస్తున్న రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో తొలి మ్యాచ్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఇండియానా పేసర్స్ జట్టు 132-131 తేడాతో సాక్రమెంటో కింగ్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. ఇరుజట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో నిర్ణీత సమయం ముగిసే సరికి 118-118తో సమమైంది.
అయితే విజేతను నిర్ణయించేందు పొడిగించిన ఐదు నిమిషాల వ్యవధిలో పేసర్స్ జట్టు గోల్ తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకుంది. వారెన్(30 పాయింట్లు) పేసర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాబోయే కొత్త సీజన్కు ముందు ఈ మ్యాచ్లను సన్నాహాక మ్యాచ్లుగా నిర్వహిస్తున్నారు.
ఈ మ్యాచ్ని వీక్షించేందుకు గాను వివిధ పాఠశాలల నుంచి 3 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. భారత్లో ఎన్బీఏకు ఆదరణ పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ మ్యాచ్లకు రిలయన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. అంతకుముందు రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మ్యాచ్ బాల్ను నిర్వాహకులకు అందజేశారు.