న్యూఢిల్లీ: టీమిండియా మాజీ బ్యాట్స్మన్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆస్పత్రి పాలయ్యాడు. కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సిద్ధూను ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. కాగా, సమయానికి చికిత్స చేయకుంటే ఇది ప్రాణాంతికమయ్యేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
చికిత్స అనంతరం కోలుకుంటున్న సిద్ధు.. తనదైన శైలిలో ఓ సరదా ట్వీట్ చేశాడు. 'కింద పడ్డా. కానీ నాటౌటే. ప్రాణాంతకమైన జబ్బు వచ్చినా దేవుడి దయవల్ల కోలుకుంటానని ఆశిస్తున్నా' అని సిద్ధు ట్విట్టర్లో పేర్కొన్నాడు.
కాగా, సిధ్దూ గురించి చెప్పుకోవాలంటే.. క్రికెటర్ మాత్రమే కాదు... మాటల మాంత్రికుడు కూడా. అతనిలో ఉరిమే ఉత్సాహం, హాస్యం కలగలిసి సెలయేరులా పదాల ప్రవాహం సాగిపోతుంది. గత ఐపిఎల్ టోర్నీకి కూడా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అయితే ఈ వ్యాధితో క్రికెట్ కామెంటరీకి ఆయన దూరమయ్యే అవకాశాలున్నాయి. కాగా, సిద్ధూ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మళ్లీ తన గళాన్ని వినిపించాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా, 51ఏళ్ల ఈ ఆటగాడు భారత్ తరపున 51 టెస్టులు, 136 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన అమృత్సర్ ఎంపీగా కొనసాగుతున్నారు.