హైదరాబాద్: నేడు జాతీయ క్రీడా దినోత్సవం. జాతీయ క్రీడా దినోత్సవంను భారత హాకీ దిగ్గజం, దివంగత మేజర్ ధ్యాన్చంద్ గౌరవ సూచకంగా ఆయన పుట్టిన రోజైన ఆగష్టు 29న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం ఓ వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.
కశ్మీరీలకు సంఘీభావం.. పాక్ ఆర్మీ నిరసనలో షాహిద్ అఫ్రిది!!
ఈ రోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2018 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించనున్నారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, మహిళా పారాథ్లెట్ దీపా మలిక్లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ గాంధీ ఖేల్రత్న' అందుకోనున్నారు. అయితే బజరంగ్, రవీంద్ర జడేజాలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేరని సమాచారం తెలుస్తోంది. రష్యాలో బజరంగ్, విండీస్ పర్యటనలో జడేజాలు ఉండడంతో వారు రాలేరని సమాచారం.
తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ 'అర్జున అవార్డు'ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నాడు. భారత కబడ్డీ జట్టు కెప్టెన్, ప్రో కబడ్డీ ఐస్ మాన్ అజయ్ ఠాకూర్ కూడా అర్జున అవార్డు అందుకోనున్నారు. సాయిప్రణీత్, అజయ్ ఠాకూర్తో పాటు మరో 17 మందికి అర్జున పురస్కారాలు ఈ రోజు దక్కనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ జాతీయ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన శ్రీలంక 'మిస్టరీ స్పిన్నర్'
భారత క్రీడారంగంలో ఖేల్రత్న అత్యున్నత పురస్కారం. గతేడాది భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మిరాబీ చాను ఈ పురస్కారం అందుకున్నారు. 1991-92లో తొలిసారి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఆ తరువాత భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కరణం మల్లేశ్వరి, గోపిచంద్లకు ఈ అవార్డు లభించింది. రెజ్లింగ్ నుంచి యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్లకు ఈ ఖేల్ రత్న అవార్డు లభించింది.