హైదరాబాద్: జాతీయ స్థాయి క్రీడాకారిణి అయిన మౌప్రియ మిత్రా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మిత్రా హూగ్లీ జిల్లాలోని బాండేల్ మనస్పూర్లో కల తన నివాసంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిలేషన్షిప్ వివాదాలతో ఆమె ఒత్తిడికి గురైందని తాము గుర్తించామన్నారు.
దీనిపై మరింత విచారణ చేపడుతున్నామని బాండేల్కు చెందిన పోలీసాఫీసర్ వివరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆమె ఇంటిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకకపోవడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం మౌప్రియా తండ్రి భాస్కర్ మిత్రాతో పాటు స్థానికంగా ఉన్న చిన్సురా క్లబ్కు వెళ్లిందని పేర్కొన్నారు. ఆమె తండ్రి మాట్లాడుతూ.. తను చాలా సెన్సిటివ్. అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు. అసలు ఇలా జరగడం నమ్మశక్యం కావట్లేదని విచారం వ్యక్తం చేశారు.
మౌప్రియ మిత్రా కోలంబోలో జరిగిన సౌత్ ఏసియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్స్లో ఒక స్వర్ణం, మరొక సిల్వర్ రెండు పతకాలు సాధించింది. మౌ మిత్రా పదో తరగతి చదువుతుండగానే జిమ్నాస్టిక్స్గా తన కెరీర్ ప్రారంభించింది. కొన్నాళ్ల తర్వాత అనుకోని ప్రమాదం సంభవించడంతో తన కాలుకి గాయం అయింది. అప్పటి నుంచి ఆమె స్విమ్మింగ్పై పట్టు సాధించారు.