హైదరాబాద్: పశ్చిమ రైల్వేకు చెందిన జాతీయ స్ధాయి స్విమ్మర్ తానికా ధార ముంబైలో అత్మహత్య చేసుకుంది. 23 ఏళ్ల తానికా ధార ముంబైలోని లోవర్ పరేల్లో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ రైల్వేలో తానికా ధార జూనియర్ క్లర్క్గా పని చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన 70వ నేషనల్ అక్వాటిక్ పోటీల్లో 1 మీటర్ స్ప్రింగ్బోర్డు ఈవెంట్లో తానిక సిల్వర్ మెడల్ సాధించింది. 2015లో తిరువనంతపురంలో జరిగిన 35వ నేషనల్ గేమ్స్లో కాంస్య పతకం సాధించింది.

నిజానికి తానికా గురువారమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె స్నేహితురాలు తానికా రూమ్కు రావడంతో విషయం వెలుగు చూసింది. గది మూసి ఉండటంతో స్థానికుల సహాయంతో తెరిచారు. కిటికికి ఉరేసుకుని ఉన్న తానికాను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే తానికా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తానికా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లిదండ్రులు కోల్కతాలో నివసిస్తున్నారు.